కదం తొక్కిన కార్మికులు

రంగారెడ్డి:

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా శుక్రవారం నాదర్‌గుల్ గ్రామంలో రచ్చబండ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు అందడం లేదని శ్రీమతి షర్మిల దృష్టికి తెచ్చారు. వ్యవసాయానికి నాలుగు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని తమ గోడు వినిపించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణం తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని షర్మిల ధ్వజమెత్తినపుడు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. చప్పట్లు కొడుతూ..జై వైయస్ఆర్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. బడంగ్‌పేట్ గ్రామంలోనూ స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. షర్మిలను చూసేందుకు వ్యవసాయ కూలీలు, నిర్మాణరంగ కార్మికులు పనులు వదిలిపెట్టుకొని యాత్రవద్దకు పరుగులు తీసి.. ఆమెతోపాటు కదంతొక్కారు. టెక్నియా పాఠశాల విద్యార్థులు తరగతుల నుంచి బయటకి వచ్చి ఆత్మీయ అతిథి పాదయాత్రను ఆసక్తిగా తిలకించారు. స్థానిక యువకులు షర్మిల యాత్రపై పూలవర్షం కురిపించారు. అల్మాస్‌గూడ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన గ్రామస్తులు రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు.

విద్యార్థుల సంఘీభావం
     స్థానిక సాన్వి మేనేజ్‌మెంజ్ కళాశాల విద్యార్థినులు తరగతులు బహిష్కరించి షర్మిల యాత్రకు సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్సుమెంట్, ఉపకార వేతనాలు అందడంలేదని బిందు, తన్వీర్ అనే ఎంబీఏ విద్యార్థినులు తమ సమస్యలను షర్మిలకు తెలిపారు. మహానేత డాక్టర వై.యస్ మరణం తరవాత ప్రస్తుత సర్కారు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందనీ, జగనన్న ముఖ్యమంత్రి కాగానే విద్యార్థుల కష్టాలు తీరతాయనీ వారికి ఆమె భరోసా ఇచ్చి ముందుకు సాగారు.
 
పోటెత్తిన యువజనం..
     షర్మిల యాత్రలో మహిళలతోపాటు, 18-35 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులు, యువకులు, పోటెత్తారు. పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా తటస్థంగా ఉన్నవారు సైతం షర్మిల యాత్రను తిలకించేందుకు ఆసక్తిచూపడం విశేషం. గహిణులు,కూలీలు దారిపొడవునా ఆమె యాత్రకు సాదర స్వాగతం పలకడం కనిపించింది.

శ్రేణుల్లో కొత్త ఉత్సాహం...
     మహేశ్వరం,ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు,శ్రేణుల్లో షర్మిల యాత్ర కొత్త ఉత్సాహం నింపింది. వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా బీఎన్‌రెడ్డి నగర్ బహిరంగ సభకు తరలిరావడం చర్చనీయాంశమైంది. షర్మిల ప్రసంగిస్తున్న సమయంలో నాడు చంద్రబాబు, నేడు కిరణ్ సర్కారు దొందూ దొందేనన్న విమర్శలు చేసినపుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. ఆమె ప్రసంగాన్ని అమూలాగ్రం వినేందుకు జనం గంటపాటు ఓపికగా రహదారులపైనే కదలకుండా నిలబడి ఉండడం విశేషం.
షర్మిల యాత్ర మొదలైన నాదర్‌గుల్ నుంచి ఇంజాపూర్ వరకు మరో ప్రజాప్రస్థానంలో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

వృద్ధుల్లోనూ ఆసక్తి...
     రాజన్న బిడ్డను చూసేందుకు వయస్సును లెక్కచేయకుండా వృద్దులు పెద్ద సంఖ్యలో పాదయాత్రకు అడుగడుగునా సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ హయాంలో పింఛన్లు సమయానికి అందాయని గుర్తుచేసుకున్నారు. పలువురు వికలాంగులు సైతం షర్మిల యాత్ర మార్గంలో ఆమెను కలిసేందుకు పోటీలు పడడం కనిపించింది.
నలువైపులా జన ప్రభంజనమే..
     సాయంత్రం బీఎన్‌రెడ్డి నగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్,తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో వనస్థలిపుర ం రహదారులు కిక్కిరిశాయి. సభాప్రాంగణానికి దారితీసే అన్ని రహదారులూ జనంతో నిండాయి. ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం కనిపించింది.

ఆకట్టుకున్న ఆటా.. పాట..
     బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన వేదికపై వంగపండు ఉష నేతృత్వంలోని కళాబృందాలు ప్రదర్శించిన ఆటా.. పాట సభకు విచ్చేసిన వారిలో ఉత్సాహం నింపాయి. వైఎస్సార్ హయాంలో జరిగిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను పాటల రూపంలో వినిపించడంతో ప్రజల్లో ఉత్సాహం నిండింది. షర్మిలతోపాటు పాదయాత్రలో పార్టీ నేతలు పుత్తా ప్రతాప్‌రెడ్డి, బి.జనార్ధన్‌రెడ్డి, జెన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ధన్‌పాల్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, పల్లపు రాము, అమృతాసాగర్, కొండా రాఘవరెడ్డి, బొక్క జంగారెడ్డి, వంగా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top