జనం మదిలో జగనే సీఎం!

  • ఎన్డీటీవీ సర్వేలో 48% మంది మద్దతు ఆయనకే
  • మధ్యంతర ఎన్నికలు జరిగితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 21 లోక్‌సభ స్థానాలు
  • టీఆర్ఎ‌స్‌కు 10.. కాంగ్రెస్‌‌కు 9, నామరూపాల్లేని టీడీపీ
  • మా అస్త్రాలు మాకున్నాయి: మొయిలీ
  • కాంగ్రెస్ అస్త్రం... సీబీఐయేనా? : వైయస్ భారతి ప్రశ్న
  • బీజేపీ ప్రభుత్వానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వరు

హైదరాబాద్, 28 ఆగస్టు 2012: కాబోయే ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డినే అత్యధిక శాతం ప్రజలు భావించుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ధీమా వారిలో బలీయంగా వ్యక్తమవుతోంది. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమన్న భావన రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోంది. ఎన్డీటీవీ నిర్వహించిన సర్వే ప్రకారం.. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నది రాష్ట్రంలోని 48 శాతం ప్రజల ఆకాంక్షగా తేలింది. ఆ తరువాతి స్థానంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు 18 శాతం మంది ప్రజలు కోరుకుటున్నట్లు చెప్పారు. టీఆర్ఎ‌స్ అధ్యక్షుడు కె.చంద్రశేఖ‌ర్‌రావుకు 17 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం మూడో స్థానం దక్కింది. కేవలం 11 శాతం మంది మాత్రమే కిరణ్‌కుమార్‌ సీఎం కావాలంటూ ఓటు వేశారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి తరఫున కేవలం 6 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్న వారు 62 శాతం మంది ఉండగా.. ఆ సంఖ్య తెలంగాణలో 19 శాతంగా ఉంది. తెలంగాణలో 43 శాతం మంది కేసీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటుండగా.. మిగతా ప్రాంతంలో ఆ సంఖ్య 4 శాతమే ఉంది.
ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాల్లో 21 సీట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇటీవల ఇండియా టుడే సర్వేలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైన విషయం తెలిసిందే. తాజా ఎన్డీటీవీ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, కాంగ్రెస్‌కు 9 సీట్లు వస్తాయని వెల్లడైంది. రెండు స్థానాలు ఇతరులకు వస్తాయని తేలింది. మజ్లిస్‌కు ఒక స్థానం పోతే మిగిలిన ఒక స్థానంలోనే టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ సర్దుకోవాల్సి వస్తుందని ఈ సర్వే తేల్చింది. అలాగే.. జగన్మోహన్‌రెడ్డి అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని ఆంధ్ర, రాయలసీమల్లోని 56 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో 26 శాతంగా ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణలో 86% మంది చెప్తుండగా.. మిగతా ప్రాంతాల్లో దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య 24 శాతంగా ఉంది.

మా అస్త్రాలు మాకున్నాయి: మొయిలీ

‘రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డికి ప్రజాదరణ నిజమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ అంగీకరించారు. ‘నేను ఆంధ్రప్రదేశ్‌కు 2009 ఎన్నికల్లో ఇన్‌చార్జిగా ఉన్నపుడు కాంగ్రెస్‌ పార్టీకి ఐదు లోక్‌సభ స్థానాలకు మించి రావన్నారు. అసెంబ్లీలో అయితే 25 సీట్లు దాటబోవన్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్‌ 33 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయముంది. అప్పటి దాకా ప్రజల్లో బలం పెంచుకోవడానికి మా అస్త్రాలు మాకున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలున్నట్లుగానే సాధారణ ఎన్నికల ఫలితాలు ఉండవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి నాయకుడు ఎవరనేది ఇప్పుడే ప్రకటించం. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు నాయకుని ఎన్నిక ఉంటుంది. ఈ పద్ధతి ఆ రాష్ట్రంలోని పరిస్థితిని బట్టి ఉంటుంది. రాష్ట్రంలో జగన్‌కు అనుకూలంగా రాజకీయ పరిస్థితులుంటే కాంగ్రెస్‌ ఆ పార్టీకి మద్దతిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించబోను’ అని వీరప్పమొయిలీ ఎన్డీటీవీ చర్చలో పేర్కొన్నారు.

ఆ అస్త్రం సీబీఐ కావచ్చు: వైయస్‌ భారతి

‘కాంగ్రెస్‌కు అస్త్రాలున్నాయని వీరప్పమొయిలీ చెప్తున్నారు.. ఆ అస్త్రం సీబీఐ కావొచ్చు’ అని జగన్మోహన్‌రెడ్డి సతీమణి వై.యస్‌.భారతి వ్యాఖ్యానించారు. సర్వే ఫలితాల ప్రసారం సందర్భంగా ఎన్డీటీవీ వ్యాఖ్యాత ప్రణయ్‌రాయ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పట్ల ప్రజాదరణకు భయపడిన కాంగ్రెస్‌ సీబీఐని అస్త్రంగా వాడుకుంటున్నది. ఇప్పటి వరకూ ఏ నాయకుడి పట్లా వ్యవహరించనంత అమానుషంగా జగన్ మీద సీబీఐ వ్యవహరిస్తోంది. కాంగ్రె‌స్‌ అస్త్రాల్లో సీబీఐ కూడా ఒకటి కావచ్చు. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన మంచి పరిపాలనాదక్షుడు వై.యస్‌.రాజశేఖరరెడ్డి. అందుకే రెండోసారి కూడా ప్రజలు ఆదరించి, అధికారాన్ని అప్పగించారు. వైయస్‌ చేసిన మంచిని మరచిన కాంగ్రెస్‌ పార్టీ జగన్మోహన్‌రెడ్డి పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్‌ అస్త్రమే ఆ పార్టీకి బూమరాంగ్‌ అవుతున్నట్లుంది. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో జగన్‌ పర్యటించారు. ఆ రెండు ప్రాంతాల ప్రజలు జగన్‌ను తమ సోదరుడిగా, తమ కుమారుడిగా ఆదరిస్తున్నారు. తెలంగాణలో జగన్ ఇంకా పూర్తిస్థాయిలో పర్యటించలేదు. జగ‌న్మోహన్‌రెడ్డి పర్యటిస్తే తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరు. ఈ విషయాన్ని ‌జగన్మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు’ అని భారతి స్పష్టం చేశారు.

 

Back to Top