న్యూఢిల్లీ, 14 సెప్టెంబర్ 2012: విచారణకు సహకరిస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారంనాడు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ కాపీని ఇంకా పరిశీలించాల్సి ఉందని భావించిన సుప్రీంకోర్టు జగన్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం, రంజనా దేశాయ్లతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.<br/>జగన్మోహన్రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్ వాదనలు వినిపించారు. రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ అభూత కల్పనలతో సీబీఐ ఆరోపణలు చేసిందని, తీరా ఛార్జిషీటుకు వచ్చేసరికి అంకెలన్నీ జారిపోతున్నాయని వారు వాదించారు. జగన్ అరెస్టై ఇప్పటికే వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు. ఆయన అరెస్టుకు ముందు మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారని, అరెస్టు చేశాక సప్లిమెంటరీ వేస్తామని సీబీఐ చెప్పినా, ఇప్పటివరకూ వేయలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సప్లిమెంటరీ వేయటానికి సీబీఐ ఇంకా ఎన్నిరోజులు సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే జగన్మోహన్రెడ్డిపై కుట్ర పన్నారని వారు వాదించారు. <br/>కాగా, సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ జైన్ హాజరయ్యారు. దాదాపు అరగంట సేపు కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు హాజరు కావల్సిన సమయంలో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. క్విడ్ ప్రో కో కేసులో మే 27, 2012న వైయస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్పై విచారణను కూడా ఈ నెల 28న చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.<br/>