జన్మభూమి కాదు టీడీపీ భూమి

జన్మభూమి లో ఒంటెత్తు పోకడలు

అడిగిన వారిపై దాడులు
పచ్చ పార్టీ కండకావరం

విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల్లో దాగి ఉన్న ఆవేదన, ఆవేశాల్ని బయటకు తెస్తున్నాయి. టీడీపీ సర్కారు సాగిస్తున్న రాక్షస పరిపాలనతో విసిగిపోయి ప్రజలు నిలదీస్తున్నారు. దీన్ని తట్టుకోలేని తెలుగు తమ్ముళ్లు బాధితులపై దాడులకు పాల్పడుతున్నారు.

చంద్రబాబు పాలనతోనే విసుగుదల
బోలెడన్న హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గద్దె నెక్కాక వాటన్నింటినీ గాలికి వదిలేసింది. రైతులు, మహిళలకు రుణమాఫీ, బడుగులకు ఇళ్లనిర్మాణం, ప్రతీ ఇంటికి ఉద్యోగం, ప్రత్యేక హోదా.. ఇలా అడుగడుగునా హామీలకు తూట్లు పొడిచింది. అధికారంలోకి వచ్చాక మాత్రం వీటిని గాలికి వదిలేయటమే కాకుండా, ఉద్యోగుల్ని తొలగించటం, రేషన్ కార్డుల్ని తొలగించటం, వ్రద్దులు వికలాంగుల పింఛన్లు తొలగించటం వంటివి విరివిగాచేపట్టారు. జన్మభూమి కమిటీల పేరుతో పచ్చపార్టీ కార్యకర్తలతో సర్వేలు చేయించి అసలైన లబ్దిదారుల్ని ఎడా పెడా తొలగించేశారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం, కోపం తారాస్థాయికి చేరుకొన్నాయి.

జన్మభూమి లో బయటపడ్డ ఆవేదన
ప్రజల్లో గూడుకట్టుకొన్న ఈ ఆగ్రహం, కోపం జన్మభూమి సమావేశాల్లో బయట పడుతున్నాయి. ప్రతీచోట ప్రజలు అధికారులు, నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. కక్ష కట్టినట్లుగా ప్రజల్ని పీడించుకొని తింటున్న వైఖరిని నిలదీస్తున్నారు. ముఖ్యంగా అర్హులైన లబ్దిదారుల్ని ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నారు అనే ప్రశ్నలకు జవాబులు దొరకటం లేదు. ముఖ్యంగా రుణమాఫీ చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న పచ్చ సర్కారు ఆచరణలో మాత్రం విఫలం చెందుతున్న తీరు మీద మండిపడుతున్నారు.

ప్రజాచైతన్యం చూసి కడుపుమంట
ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం వెల్లివిరుస్తుండటంతో తెలుగుదేశం నాయకులకు దిక్కు తోచటం లేదు. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుండటంతో ముఖం చాటేస్తున్నారు. కొన్ని చోట్ల బరి తెగించిన నేతలు మాత్రం తిరగబడి బాధితులపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రశ్నించిన ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. దీనిమీద సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

Back to Top