ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్‌ జగన్‌

ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఆ  21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలు
ఎన్నికలంటే టీడీపీ నేతలకు భయం


నంద్యాల: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి అన్నారు. దేశంలోనే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలోకి వేరే ప్రజాప్రతినిధులు వస్తే వారితో రాజీనామా చేయించిన తరువాతనే పార్టీలో చేర్చుకున్న నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని గర్వంగా చెప్పారు. ఇటీవల నంద్యాల బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగాన్ని, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేల్చుతున్నారని తప్పుపట్టారు. నంద్యాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు నీతులు చెబుతున్నారని, ప్రజాస్వామ్య దేశంలో నీతులు చెప్పడం మంచిదే అన్నారు. అయితే టీడీపీ నేతలు చెబుతున్న నీతులు నేతి బీరకాయలో నెయ్యి అంత చందమే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ మారితే ఆ పార్టీకి రాజీనామా చేయాలన్నారు. గతంలో కొలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారన్నారు. తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారన్నారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో మా నాయకుడికి చక్రపాణిరెడ్డి రాజీనామా పత్రం ఇచ్చారని గుర్తు చేశారు. తాము విశ్వసనీయత పాటిస్తున్నామన్నారు.      
తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలో పశువులను కొన్నట్లు మా ఎమ్మెల్యేలను కొన్నారని విమర్శించిన చంద్రబాబు , ఏపీలో  21 మందిని తన పార్టీలో ఎలా చేర్చుకున్నారని, ఆయన ఏ పశువులను కొన్నారని నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి చేసి ఉంటే 21 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. అంటే మీకు ప్రజల మీదా, ప్రజాస్వామ్యం మీదా నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు అనవసర వ్యాఖ్యలతో రాద్దాంతం చేయడం సరికాదన్నారు. ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఇన్నాళ్లు మీరు శంకుస్థాపన చేయలేదని, ఇవాళ ఉప ఎన్నిక ఉందని హడావుడిగా శంకుస్థాపనలు చేయడం సిగ్గు చేటన్నారు. మా పార్టీ ఏ విలువలు కాపాడుతోందో, వైయస్‌ జగన్‌ ఎలా నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైయస్‌ జగన్‌ చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు.  మళ్లీ ఎన్నికలకు వెళ్తే గెలవలేమనే అపనమ్మకంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నారని విమర్శించారు. 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. నంద్యాల ప్రజలకు మీరు ఏం చేయబోతున్నారో ఏ మంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి స్పష్టంగా చెప్పడం లేదన్నారు. ఎన్నికల తరువాత వీరంతా ఎక్కడ ఉంటారో అని ప్రశ్నించారు. దేశంలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతున్నది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు.  ఇంత జరుగుతున్నా చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 20 మందిని నేను గెలిపించలేను, అందుకే వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చామని చంద్రబాబే ఒప్పుకోవాలన్నారు

తాజా వీడియోలు

Back to Top