<strong>మీకు ఒక రూలు.. ఇతరులకు ఒక రూలా..!</strong><br/>గుంటూరు: ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఆయన తలపెట్టిన దీక్షకు ఆటంకాలు కల్పించేందుకు అడ్డదారులు తొక్కుతోంది.<br/><strong>చంద్రబాబుకి ఒక రూలు</strong>చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రచారం కోసం చేయని పని లేదు. నిరుపేద రాష్ట్రపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆకాశమంత పందిరి వేసి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టారు. తర్వాత ఏ పని చేపట్టినా గుంటూరు, విజయవాడ, విశాఖ నగరాల్లో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నవ నిర్మాణ దీక్ష పేరుతో విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంజి సర్కిల్ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించారు. అన్ని ప్రధాన వీధుల్లోనూ ట్రాఫిక్ ను నిలిపివేశారు. తర్వాత సదస్సులు, సమీక్షలు పేరుతో డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. అటు, ప్రజలకు తీరని ఇబ్బంది పెడుతున్నారు.<br/><strong>ప్రజల తరపున పోరాడితే తప్పు పడుతున్నారా..!</strong>రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను తెప్పించటంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం చంద్రబాబుకి మింగుడు పడటం లేదు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో జరిగిన యువభేరి విజయవంతం కావటంతో బాబు గుండెల్లో రాయి పడింది. దీంతో పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అనుమతులు లేవంటూ ప్రకటనలు ఇప్పించటం మొదలు పెట్టారు. ట్రాఫిక్ ఆగిపోతుందంటూ సాకులు మొదలు పెట్టారు. విజయవాడ బెంజి సర్కిల్ ఎంతటి రద్దీ ప్రాంతమో కోస్తా ప్రాంత వాసులు అందరికీ తెలుసు. అటువంటి చోట జనాన్ని పోగు చేసి ట్రాఫిక్ ను అడ్డుకోవటం ఒప్పు అని నిర్ధారించిన నాయకులు, రోడ్డు తో సంబంధం లేకుండా పక్కగా దీక్ష చేస్తానంటే అడ్డుకోవటాన్ని ఏమనుకోవాలి. ఇది కచ్చితంగా ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు అని అర్థం అవుతోంది.