వైయస్సార్సీపీకి భయపడే

తిరుపతి కార్పొరేషన్: ప్రజల విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం ప్రభుత్వం.... తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోందని  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. నగరంలోని 24వ డివిజన్(ఇందిరానగర్‌)లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా  కరుణాకరరెడ్డి మాట్లాడుతూ... రాజ్యసభ నామినేషన్ విషయంలో పార్టీ  విజయం సాధించిందని తెలిపారు. 

 సంఖ్యా బలం లేనప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి  అప్రజాస్వామికంగా 4వ అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రయత్నించారని, ఆఖరి నిమిషంలో వైయస్సార్‌సీపీకి భయపడి ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నానని కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏ ఎమ్మెల్యే కూడా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదన్నా రు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో 40 సార్లు, మొత్తం 6.30 గంటలు తిరుపతి నగర సమస్యలపై గళమెత్తానని చెప్పారు. ఎప్పుడు  కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించినా వైయస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న తపనతో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం సర్వే చేయిస్తే నగరంలోని 50 డివిజన్‌లలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి  39 స్థానాల్లో  విజయం తథ్యమని  పక్కా సమాచారం వెళ్లిందన్నారు. దీంతో ప్రభుత్వం భయపడి ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తోందని తెలిపారు. 

సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్‌కెబాబు, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర, నగర మహిళా అధ్యక్షురాలు కుసుమ,నాయకులు పుల్లయ్య, చంద్రశేఖర్ రెడ్డి, పునీత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Back to Top