ఏపీలో దుశ్సాసన పాలన

ఏపీ బీహార్ కు తాతలా తయారైంది
ఎన్నికలొస్తే టీడీపీకి తెలిసొచ్చేది
చంద్రబాబు చెంపచెల్లుమనేలా ప్రజలు తీర్పిచ్చేవారు
టీడీపీ తన తప్పులను ప్రతిపక్షంపై రుద్దాలని చూస్తోందిః చెవిరెడ్డి

హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు మాఫియాను ప్రోత్సహిస్తూ దుశ్సాసన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు గతంలో బిహార్ రాష్ట్రం కంటే దారుణమన్నారు. ఏపీ బిహార్‌కు తాతలా తయారైందని నిప్పులు చెరిగారు. తప్పులన్నీ మీరుచేసి, ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసి, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే, వాళ్లను శిక్షించాల్సింది పోయి మా పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం బాధాకరమని చెవిరెడ్డి అన్నారు. వీళ్ల అదృష్టం వల్ల ఇప్పటివరకూ ఏ ఎన్నికలూ రాలేదు. వచ్చిఉంటే ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఎంత కసిగా, ఎంత కోపంతో తెలిసేదన్నారు. చంద్రబాబు చెంప ఛెళ్లుమనేలా తీర్పు ఇచ్చేవారన్నారు. తొమ్మిదేళ్ల పాటు సాగిన నరకాసుర పాలన, దుశ్శాసన పాలన మళ్లీ కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారని..అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద చెవిరెడ్డి మీడియాతో అన్నారు. 


ఎమ్మెల్యేలకు విమాన టికెట్లు ఇచ్చి విదేశాలకు పంపారు. ఒకే ఇంట్లో ఉండి, తమ్ముడు చేసేది అన్నకి తెలియదంటే ఎవరు నమ్ముతారు? నిఘా డీజీపీయే నిందితులతో ఫొటోలు తీయించుకుంటున్నారు. మరో నిందితుడు చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, మీడియా చేతిలో పెట్టుకుని ఏమైనా చేసేయొచ్చని అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. అందరం చేయి చేయి కలుపుదామని, తప్పు ఎవరు చేసినా శిక్షించేలా ముందుకెళ్దామంటే మహిళలపై జరుగుతున్న దారుణాల మీద మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దారుణమన్నారు. తప్పును సరిదిద్దాలని తాము కోరుతుంటే అసెంబ్లీలో మాట్లాడే వాక్  స్వాతంత్ర్యం కూడా కల్పించడం లేదని చెవిరెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top