జగన్‌ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

‌ఖమ్మం, 28 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బయటికి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని‌ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తెలిపారు. శ్రీ జగన్ విడుదలయితే తమ ఉనికికి ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందోనని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ‌టిడిపిలు అనేక కుయుక్తులు పన్నినప్పటికీ న్యాయం గెలిచి వారి ఎత్తుగడలు చిత్తయ్యాయన్నారు. ప్రజల్లో శ్రీ జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి టిడిపి నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు.‌ శ్రీ జగన్‌కు బెయిల్ ఇవ్వకపోతే న్యాయం గెలిచిందని, న్యాయవ్యవస్థ మంచిదని పొగిడిన వారు బెయి‌ల్ ఇవ్వగానే ‌సిబిఐ తీరు సరిగా లేదని, కేంద్ర ప్రభుత్వం అండతోనే ఆయన విడుదలయ్యారని అంటున్నారని పొంగులేటి విమర్శించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా‌ వైయస్ అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు‌ తమ జీవితంలో మరువరాని రోజుగా భావిస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఓదార్పు యాత్ర కంటే రెట్టింపు ఉత్సాహంతో జైలు దగ్గరి నుంచి లోటస్‌పాండ్‌లోని శ్రీ జగన్ వరకు లక్షలాది‌ మంది బ్రహ్మరథం పట్టి స్వాగతించారని తెలిపారు. ఇది చూసిన టిఆర్‌ఎస్ నాయకుల గుండెల్లో సైతం రైళ్లు పరిగెడుతున్నాయని‌, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం తెలంగాణ జిల్లాల్లో కూడా వీస్తుందనే భయం వారికి పట్టుకుందని అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కూడా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

Back to Top