బోగస్‌ ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బోగస్‌ ఓట్లతో గెలిచారని వైయస్ఆర్‌ సీఎల్పీ కో ఆర్డినేటర్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ నియోజకవర్గంలో 43 వేలకు పైగా బోగస్ ఓట్లు నమోదు చేయించుకున్న చంద్రబాబును బోగస్‌బాబు అనాలా... దొంగబాబు అనాలా? అని గడికోట తూర్పారపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1989లో కుప్పం నియోజకవర్గంలనే చంద్రబాబు తొలిసారి పోటీచేసినపుడు 6 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చిందన్నారు. ఆ తరువాత రెండు ఎన్నికలలో అది వరుసగా 44 వేలు, 50 వేలకు పెరిగిందన్నారు. ‌ఇంతలా భారీగా మెజారిటీ రావడం వెనుక బోగస్ ఓట్ల మహిమ ఉందన్నారు.

కుప్పం నియోజకవర్గంలోని మొత్తం 1.96 లక్షల ఓట్లలో 43 వేలు బోగస్‌వి అని స్వయంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారే నిర్ధారించారని శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తావించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సరిహద్దు ఓటర్లను చంద్రబాబు తన నియోజకవర్గంలో చేర్పించుకున్నారని తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే తిరుమల వేంకటేశ్వరస్వామిపై గానీ, కాణిపాకం వినాయకునిపై గానీ ప్రమాణం చేసి బోగస్ ఓట్లు చేర్పించలేదని చె‌ప్పాలని సవాల్ ‌చేశారు.

బోగస్ నీతి‌నే రాజకీయాల్లోనూ అనుసరించిన చంద్రబాబు వాటిని దిగజార్చారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కుప్పంలో తేలిన బోగస్ ఓటర్ల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు చేయించాలని‌ ఆయన డిమాండ్‌ చేశారు. బోగస్‌ ఓట్లు చేర్పించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అన్నారు.‌ ఉరవకొండ, ఎల్బీనగర్‌తో పాటు అనేక నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తున్నందున వాటిపై కూడా విచారణ జరపాలన్నారు. అవినీతి గురించి ఇతరులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ముందుగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలన్నారు.

విభజన బిల్లు రాష్ట్రానికి రావడానికి చాలా ముందుగానే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినా పట్టించుకోకుండా ఇప్పుడు తానే సమైక్య చాంపియన్‌ అని చెప్పుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని గడికోట ఎద్దేవా చేశారు.

రాష్ట్ర పునర్విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి పంపిన వర్తమానాన్ని కేంద్రం రాష్ట్రానికి పంపిన తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని కోరుతూ బంద్‌లో పాల్గొన్న వారందరికీ, పార్టీ శ్రేణులకు పార్టీ తరఫున గడికోట కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top