తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దీక్షలు మోసపూరితం అని, ప్రజల ద్రష్టిని మళ్లించేందుకే వీటిని చేపడుతున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన 47, 48 డివిజన్ల కమిటీల నియామకానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న ఏకైక వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ఎంతటి ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడేదిలేదన్నారు. ప్రజలకు గుక్కెడ తాగునీరు అందించలేరు గానీ మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నారన్నారు.రైతులు, మహిళల రుణాలను మాఫీ చేస్తా.. అమరావతిలో ఇంద్ర లోకాన్ని నిర్మిస్తా అంటూ సీఎం అబద్ధాలను అద్భుతంగా చెబుతున్నారని ధ్వజమెత్తారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతూ మోసపూరిత వాగ్దానాలను సైతం కళ్లముందు అన్నీ చేసినట్లుగా వర్ణించగల మాంత్రికుడు చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ప్రజా సంక్షేమం కోసం చిన్నపాటి అభివృద్ధి కూడా చేసిన పాపానపోలేదని మండిపడ్డారు.