ఆంధ్రా ట్రంప్ అవతారం చంద్రబాబు

  • దగాపడ్డా ప్రతి ఒక్కరి పోరాటానికి వైయస్‌ జగన్‌ అండ
  • ముద్రగడ పాదయాత్రకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు
  • టీడీపీ సర్కార్ పై తిరగబడాలని ప్రజలకు భూమన పిలుపు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్లలో ఒక్కహామీ కూడా అమలు కాలేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమనకరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. ఏదో ఒక సాకు చూపుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, తుంగలో తొక్కారని  ధ్వజమెత్తారు. ఎన్నికలు ముగియగానే చంద్రబాబు మాట మరిచారన్నారు. చంద్రబాబు సర్కార్‌ చేతిలో దగా పడ్డ ప్రతి ఒక్కరి పోరాటానికి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అండగా ఉంటారని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న సత్యాగ్రహ యాత్రకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు ఉంటుందని భూమన ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూమన మాట్లాడుతూ..2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన  హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 

అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారన్నారు. అవుట్‌సోర్సింగ్ , కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామన్న హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఉడగొట్టారని విమర్శించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప సంఘం కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి, సుప్రీం కోర్టు నిర్ణయం అడ్డమని టీడీపీ సాకు చెబుతోందన్నారు. తెలంగాణలో అడ్డురాని నిబంధనలు ఏపీలో అడ్డొస్తున్నాయా అని నిలదీశారు.

దివ్యాంగుల జీవితాలతో చెలగాటం
చంద్రబాబు ప్రభుత్వం చివరకు దివ్యాంగుల జీవితాలతోనూ  చెలగాటమాడుతోందని భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సదరన్‌ క్యాంపుల పేరుతో కాలయాపన చేస్తూ దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తామని, ల్యాప్‌టాప్‌లు,  సైకిళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు హామీలతో మోసపోయిన ప్రజలు తిరగబడాలని భూమన పిలుపు నిచ్చారు. 

కాపు ఉద్యమం తరహా పోరాటం
కాపు ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. టీడీపీ సర్కార్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భూమన వివరించారు.  ట్రంప్‌కు చంద్రబాబుకు దగ్గరి పోలికలున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ట్రంప్‌ ఆంధ్రా అవతారం చంద్రబాబు అని భూమన కరుణాకర్‌రెడ్డి అభివర్ణించారు.

Back to Top