చంద్రబాబుకు నీతి లేదు: షర్మిల

తణుకు, 31 మే 2013:

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నీతీ, న్యాయం లేవని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహం తప్ప మరో ధ్యాస లేదన్నారు. ఆయనకు విశ్వసనీయత లేదనీ, మాటపై నిలబడడం చేతకాదనీ విమర్శించారు. హైదరాబాద్‌లో చార్మినార్‌, నాగార్జునసాగర్‌ను కూడా తానే కట్టించానని అంటారేమోనని షర్మిల ఎద్దేవా చేశారు.

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి  కరెంట్ కోతలతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్న సంగతి  తెలియడం లేదని  విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనలో చంద్రబాబు, కిరణ్ ఇద్దరు దొందూ దొందే అని శ్రీమతి షర్మిల అన్నారు. 9 గంటల విద్యుత్‌ ఇస్తామన్న వైఎస్ హామీని కిరణ్ గాలికొదిలేశారన్నారు.

చంద్రబాబుకు నీతి న్యాయం లేదని, మూడో పార్టీ ఉండకూడదని కుట్రపన్ని జగనన్నను జైలుకు పంపించారన్నారు. తొలుత తణుకు సెంటర్‌లో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించారు.

Back to Top