దేశమంతా రాష్ట్రం వైపు చూడాలనే అవిశ్వాసం

న్యూఢిల్లీ :

దేశం మొత్తం మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం వైపు చూడాలనే ఉద్దేశంతోనే తాము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడతో సోమవారం సాయంత్రం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకే చెందిన సొంత ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారని, ఆ తీర్మానానికి తాము మద్దతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మాదిరి ఫలితాలే వస్తాయని శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని హెచ్చరించారు. ఈ ఎన్నికల ఫలితాలతో అయినా కాంగ్రెస్‌కు బుద్ధి వస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ది వచ్చి ప్రజలకు మేలు చేయడానికి దేశం మొత్తం మీద ఇదే జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదే‌శ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. అదే పార్టీకి చెందిన ఎం‌పీలు సోనియాపై అవిశ్వాం ప్రకటించారని చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ఓ సామాన్యుడు, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న తాము విభజనను ఎలా అడ్డుకోగలం? అని మీడియా ప్రశ్నకు ఆయన బదులుగా ప్రశ్నించారు.

ఆర్టికల్‌-3 సవరణకు దేవెగౌడ మద్దతు కోరినట్లు శ్రీ వైయస్ జగన్ తెలిపారు. ‌ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం మరో రాష్ట్రానికి జరుగకూడదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ అభిప్రాయం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని శ్రీ జగన్‌ విమర్శించారు.

Back to Top