()
ఓటుకు కోట్లు కేసులో బాబు ముద్దాయి
()నిందితుడిగా ఉన్న వ్యక్తి సీఎంగా అనర్హుడు
()చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి
()వైయస్సార్సీపీ నేతల డిమాండ్
హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చెలామణి అవ్వడం దారుణమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఏపీని లూటీ చేసి అక్రమ సంపాదనతో నిస్సిగ్గుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా బాబు చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో బాబు, ఆయన మనుషులు ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు.
ఓటుకు కోట్లు కేసుపై ఆర్కే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విచారించిన న్యాయస్థానం కేసును పునర్విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. అనంతరం కోర్టు బయట ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.... ఓటుకు కోట్లు కేసులోని సంభాషణలతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు సందర్భాల్లో మాట్లాడిన ఆడియో టేపులను తీసుకుని వాటికి దేశ విదేశాల్లోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్లలో పరీక్షలు చేయించానని ఆయన చెప్పారు. ఆయా ల్యాబ్లు ఇచ్చిన సర్టిఫికెట్లు తీసుకుని ఈనెల 8వ తేదీన ఏసీబీ కోర్టును ఆశ్రయించానన్నారు. దీనిపై రెండుమూడు సార్లు వాదనలు విన్న న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు.
ఓటుకు కోట్లు కేసు విషయం బయటకొచ్చాక..నాకు ఏసీబీ ఉంది, పోలీసులున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను బెదిరించారని, ఆ తర్వాత కేసు నుంచి బయట పడేందుకు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని ఆర్కే విమర్శించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా...హడావుడిగా విజయవాడకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇన్ని తప్పులు చేస్తున్నా పెద్ద మనిషిగా, ముఖ్యమంత్రిగా చలామణి అవ్వడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు చట్టం మీద, న్యాయవ్యవస్థ మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే దిగిపోవాలి తప్ప అప్పీలుకు వెళ్లకూడదని చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్లినా కూడా ఈ కేసులో న్యాయం జరుగుతుందనే తాము ఆశిస్తున్నామన్నారు.
నూటికి నూరుపాళ్లు ముద్దాయి
ఓటుకు కోట్లు కేసులో నిస్సిగ్గుగా దొరికిపోయిన చంద్రబాబును ఇన్నాళ్ల వరకు ముద్దాయిగా చేర్చలేదన్న విషయాన్ని తాము ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చామని ఈ కేసులో పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఇన్నాళ్లుగా సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నూటికి నూరుపాళ్లు ముద్దాయి అని ప్రతి ఆత్మ ఘోషించినా, సంవత్సరం నాలుగు నెలల పాటు ఆయనను ముద్దాయిగా చేయలేకపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు ముద్దాయి అనడానికి వీలున్న ప్రతి అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చామని తెలిపారు.
సీఎం పదవికి అనర్హుడు
తన ఒక్కడి స్వార్థ ప్రయోజనాల కోసం ఇటు తెలంగాణలో అటు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టు పెట్టిన చంద్రబాబు... సీఎం పదవికి అనర్హుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దోషిగా చెప్పడం లేదని ప్రశ్నించారు. మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు ..ఆ వాయిస్ తనదేనని ఒప్పుకున్నారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యంలో అతిపెద్ద నేరమని, నిందితుడిగా ఉన్న వ్యక్తులు సీఎం పదవికి అనర్హులని అన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. చంద్రబాబును కేసీఆర్ ఎందుకు వెనకేసుకొస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.