హైదరాబాద్: పరిపాలనలో తన వైఫల్యాలు, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోడానికే చంద్రబాబు శ్వేత పత్రాలంటూ కొత్త డ్రామాలకు తెరదీశారని మాజీ మంత్రి కె.పార్థసారధి మండిపడ్డారు. అధికారం కోల్పోతున్నామన్న భయం చంద్రబాబులో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని,అందుకనే శ్వేతపత్రాల పేరుతో అబద్దాలను ప్రజలకు చెపుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకే అర్థశాస్త్రం అంతా తెలిసినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు ప్రతి నెలా ఆర్బీఐ వద్దకు వెళ్లి ఎందుకు ఓవర్ డ్రాఫ్టు తీసుకుంటున్నారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉంటుందని ఇంతకంటే ఆయన పనితీరుకు నిదర్శనం ఏం కావలన్నారు. రాష్ట్రానికి 90 వేల కోట్ల మేర ఆదాయానికి గండపడిందంటూ చెపుతున్న చంద్రబాబు తాను ఎన్డీఏలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు నిలదీయలేదని, పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందంటూ కితాబిస్తూ, అసెంబ్లీలో కూడా ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా వద్దంటూ, ప్యాకేజి కావాలంటూ లాలూచి పడి రాష్ట్రాన్ని నట్టేట ముంచారన్నారు. శ్వేతపత్రాల్లోనూ, ఇతరత్రా అన్ని వేదికల్లోనూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందంటూ చంద్రబాబు చెపుతున్నారని, అదే నిజమైతే గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో రైతులుఅప్పలు పాలవుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిరంతరం ప్రతిపక్ష నేతను విమర్శించం...లేదంటే ఎవరో ఒకరి కాళ్లు పట్టుకుని అధికారంలోకి మరోసారి ఎలా రావాలన్న ఆలోచన తప్ప మరోటి లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అన్ని విషయాలపై సమర్ధమైన ఆలోచనలు, సమగ్రమైన అవగాహన ఉందని, అందుకనే అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాలు తెస్తానని గట్టిగా చెపుతున్రని ఆయన పేర్కొన్నారు.