<span style="text-align:justify">తిరుపతి: పట్టిసీమ, రాజధాని నిర్మాణం పేరుతో దోచుకున్నఅవినీతి సొమ్ముతోనే జూబ్లీహిల్స్లో చంద్రబాబు ఇల్లు కట్టుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. గురువారం తిరుమల వచ్చిన ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ..కేవలం ఆరునెలల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయని నిలదీశారు. దేశంలో పాలు, కూరగాయలు విక్రయించేవాళ్లు చాలామంది ఉన్నా, ఒక్క చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ షేర్ విలువ మాత్రమే పెరగడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పేదవాడికి ఒక్క ఇల్లూ నిర్మించని సీఎం...కోట్ల రూపాయిలతో విలాసవంతమైన ఇల్లు నిర్మించుకోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునేందుకు అయిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. వైయస్ జగన్పై అనవసర విమర్శలు చేసిన చంద్రబాబు తన ఇంటి గృహప్రవేశానికి ఎందుకు ఎవర్నీ పిలవలేదని ప్రశ్నించారు. నాకు వాచీ లేదు...ఉంగరం లేదన్న చంద్రబాబు మరి ఇల్లు ఎలా కట్టారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కరువు వస్తుందని రోజా ఎద్దేవా చేశారు. లోకేశ్ ఒక్కరికి ఉద్యోగం ఇస్తే రాష్ట్రంలో యువత మొత్తానికి ఉద్యోగం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ఫీలవుతున్నారన్నారు.</span>