- సోషల్ మీడియాకు సంకెళ్లు వేయడం బాబు తరం కాదు
- టీడీపీ నేతల అరాచకాలతో ప్రజల్లో భయాందోళన నెలకొంది
- దోపిడీకి చంద్రబాబు లైసెన్స్ ఇవ్వడం వల్లే అధికారులపై దౌర్జన్యాలు
- ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధించడం తగదు
- ప్రభుత్వానికి వైయస్సార్సీపీ నేత పార్థసారధి హెచ్చరిక
విజయవాడః చంద్రబాబుకు వైయస్ జగన్ భయం పట్టుకుందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. పత్రికల్లో, సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ఏవార్త వచ్చిన బాబు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలను వేధించి, అక్రమ కేసులు పెట్టి వాళ్ల నోళ్లు మూయించాలనుకోవడం బాబు అవివేకమన్నారు. ఒక వ్యక్తి నోరు మూయించొచ్చేమో గానీ లక్షలాది మంది గొంతులు మూయించడం బాబు తరం కాదన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. పౌరుల హక్కులు కాలరాస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జస్టిస్ కట్జూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని పార్థసారధి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఐతే, జగనే కట్జూ చేత లేఖ రాయించాడని టీడీపీ నేతలు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని పార్థసారధి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులకు అధికారమివ్వకుండా జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇవ్వడం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇవ్వడం. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెట్టి శాసనసభ్యురాలిని అవమానించడం. ఎస్సీ, ఎస్టీ నిధులను దారి మళ్లించడం లాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని పార్థసారధి ఫైర్ అయ్యారు. పరకాల ప్రభాకర్ ప్రభుత్వ తీరునను సమర్థించుకోవడంపై పార్థసారధి మండిపడ్డారు. వైయస్ జగన్, ఆయన కుటుంబసభ్యులను, మహిళలని కూడ చూడకుండా ఏ విధంగా కించపరుస్తూ పోస్టులు పెట్టారో ప్రభాకర్ కు తెలియదా..? అని నిలదీశారు. బాబు తన అసమర్థ పుత్రుడిపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో వేధించడం తగదన్నారు.
మా కార్యకర్తలు చెప్పినట్టు చేయమని హోటల్ లో ఐఏఎస్ అధికారులను బాబు ఆదేశించాడంటే ఆయన దేనికోసం మఖ్యమంత్రి అయ్యాడో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు. విజయవాడలోని దౌర్జన్యాలు, మాఫియాలకు బాబు సూచనలే కారణమని దుయ్యబట్టారు. ఫోరంకిలో వందల కోట్లు విలువ చేసే భూములకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సర్కార్ పై పార్థసారధి ధ్వజమెత్తారు. అధికారులపై దౌర్జన్యానికి దిగిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి చంద్రబాబు వారిపై ఉన్న కేసులను మాఫీ చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో జరిగే అక్రమాలన్నీ టీడీపీ వాళ్ల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతల దోపిడీ, దౌర్జన్యాలతో రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలు, అరాచకాల్ని వ్యవస్థీకృతం చేసున్నారని బాబుపై మండిపడ్డారు. దోపిడీకి బాబు లైసెన్స్ ఇవ్వడం వల్లే టీడీపీ నేతలు అరాచకాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. పుచ్చు వంకాయలని ఏరేయకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. రైతులు, ప్రజల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం దివాళాకోరు తనంతో పనిచేస్తోందని పార్థసారధి ఫైర్ అయ్యారు.