అన్నింటా ప్రభుత్వం పూర్తిగా విఫలం

బ్రాహ్మణపల్లి (అనంతపురం జిల్లా), 30 అక్టోబర్‌ 2012: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ‌అధికారంలో ఉన్నప్పుడు అనారోగ్యరీత్యానో, ప్రమాదానికి గురైనప్పుడో ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే 108 వాహనం 'కుయ్‌.. కుయ్‌.. కుయ్'‌మంటూ వచ్చి ఆదుకునేదని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్ షర్మిల పేర్కొన్నారు. ఇప్పుడు దాని జాడే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిపోయినట్లయిపోయింది 108 అన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా... పూర్తిగా.. పూర్తిగా విఫలమైందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం రాత్రికి అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల విశేష సంఖ్యలో హాజరైన అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
నిజానికి ఈ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి నిలదీయాల్సి ఉంది. చంద్రబాబుగారు చాలా గొప్పవారు. ఆయన హయాంలో 800 మందిని పొట్టన పెట్టుకున్నారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం పూర్తిగా చంద్రబాబు నాయుడిదే అని షర్మిల అన్నారు. పాదయాత్ర అని చంద్రబాబు నాయుడు కొత్తగా డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయగల ఎమ్మెల్యేలు టిడిపికి ఉన్నారు. అయితే, ఆ పనిని ఆయన చేయబోరట, ప్రభుత్వాన్ని కాపాడుతూనే ఉంటారట అని షర్మిల ఎద్దేవా చేశారు.
వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ధనవంతులతో సమానంగా తామూ కార్పొరేట్‌ ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకునే వారమని అనేకమంది పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు తరతో చెబుతున్నారని షర్మిల తెలిపారు. ఇప్పుడు ఆ సౌకర్యం లేక అల్లాడిపోతున్నామని వారి విలపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు అనారోగ్యం వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు పోరు. ఎందుకంటే అక్కడ మందులే ఉండవని వారికి తెలుసు అని షర్మిల విమర్శించారు. కాని పేదలు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్ళాలట అని షర్మిల అన్నారు.

ఉరవకొండలో షర్మిలకు ఘనస్వాగతం:
అంతకు ముందు, షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రానికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ పాదయాత్ర చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు వై.విశ్వేశ్వర రెడ్డి, వై.మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో అశేష సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు. రాచానపల్లి వద్ద రూట్సు పబ్లిక్‌ స్కూల్ విద్యార్థులతో షర్మిల కొద్దిసేపు ముచ్చటించారు.

తాజా వీడియోలు

Back to Top