అన్ని దారులూ ఇడుపులపాయ వైపే...


పులివెందుల :  చరిత్రాత్మకమైన పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమీప గ్రామాల ప్రజలు, గ్రామస్తులు 3 కిలో మీటర్ల మేర మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఉన్న షర్మిల పాదయాత్ర ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. వేల్పుల గ్రామం నుంచి బెస్తవారిపల్లె గ్రామం వరకు 750 ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. వేల్పుల గ్రామం నుంచి సాగే పాదయాత్రలో షర్మిలను పూలు పరిచి గ్రామస్థులు స్వాగతించనున్నారు. ఇందుకోసం టన్ను పూలను బెంగళూరునుంచి తెప్పిస్తున్నారు.  గ్రామ సమీపం నుంచి బెస్తవారిపల్లె వరకు పూలమీద నడిపించి పాదయాత్ర సాగేలా చూస్తున్నారు. అంతేకాక గ్రామ సమీపంలోకి ప్రవేశించిన షర్మిలకు 500మంది మహిళలతో హారతి ఇచ్చి స్వాగతించేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు.
మరికొన్ని గంటల్లో చారిత్రాత్మక ఘట్టానికి ఇడుపులపాయ వేదిక కానున్నది. రాజన్న బాటలో రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు, మేమున్నామంటూ భరోసా కల్పించేందుకు షర్మిల 3 వేల కి.మీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దేశ చర్రితలో ఇంతవరకు ఏ మహిళా చేయని సాహసోపేత ప్రస్థానానికి షర్మిల శ్రీకారం చుడుతున్నారు. వేలాదిమంది అభిమానులు వెంటరాగా గురువారం మహానేతకు నివాళి అర్పించి పాదయాత్రలో ఆమె తొలిఅడుగు వేయనున్నారు.
షర్మిల పాదయాత్రకు సంబంధించి ఇడుపులపాయలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ కుటుంబ సభ్యులు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల,కోడలు భారతి బుధవారం రాత్రికే ఇడుపులపాయకు చేరుకున్నారు.
ఇడుపులపాయ జనసంద్రం-
వేంపల్లె మార్గం కొత్త శోభను సంతరించుకుంది. జగన్ అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి బుధవారం రాత్రికే ఇడుపులపాయకు చేరుకున్నారు. దీంతో ఇడుపులపాయలో పండుగ వాతావరణం నెలకొంది. షర్మిల పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయేలా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.  పాదయాత్రకు మద్దతుగా తరలివచ్చిన వేలాదిమంది అభిమానులను ఉద్దేశించి విజయమ్మ, షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ జగన్ అభిమానులు పాదయాత్రగా షర్మిలతో ముందుకు కదలనున్నారు. మధ్యాహ్నం వీరన్నగట్టుపల్లె సమీపంలో భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వేంపల్లెలో బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో బస చేస్తారు. ఇడుపులపాయలో పాదయాత్ర ఏర్పాట్లను సమన్వయ కమిటీ సభ్యులు నల్లారి సూర్యప్రకాశ్‌రావు, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ప్రోగాం కో ఆర్డినేటర్ తులసి రఘురాం, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పరిశీలించారు. మిగిలిన అన్ని ఏర్పాట్లను వైఎస్ కొండారెడ్డి పర్యవేక్షిస్తున్నారు..
ఇడుపులపాయ ముస్తాబు:
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ :మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కు మార్తె షర్మిల చేపట్టబోయే పాదయాత్రకు ఇడుపులపాయ ముస్తాబైంది. గురువారం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఇడుపులపాయకు లక్షల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి రానున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ ఘాట్‌ను ముస్తాబు చేయడంతోపాటు ఘాట్ పరిసర ప్రాం తాలలో మీడియా పాయింట్‌కు సంబంధించిన స్టేజీని కూడా సిద్ధం చేస్తున్నారు.
రాయచోటి- వేంపల్లె ప్రధాన రహదారిలోని కుమ్మరాంపల్లె సమీపంలో భోజనాల ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
దీంతోపాటు ఇడుపులపాయ క్రాస్‌లో ఆర్చిలు, తోరణాలు పెద్ద ఎత్తున కడుతున్నారు. వేంపల్లె నుంచి ఇడుపులపాయ వరకు దారి పొడవునా మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.విజయమ్మ, వై.ఎస్.జగన్, షర్మిలలకు సంబంధించి పెద్ద, పెద్ద కటౌట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ జెండాలు దర్శనమిస్తున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ సీపీకి సంబంధించిన జిల్లా నేతలతోపాటు రాయలసీమలోని వివిధ ప్రాంతాలనుంచి కూడా ముఖ్య నేతలు ఇడుపులపాయకు విచ్చేసి పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
అన్ని దారులూ ఇడుపులపాయ వైపే...
షర్మిల పాదయాత్ర సందర్భంగా గురువారం అన్ని దారులు ఇడుపులపాయ వైపే మళ్లనున్నాయి. ఇడుపులపాయ అంటేనే రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇడుపులపాయలో ఏ కార్యక్రమం చేపట్టినా లక్షల సంఖ్యలో అభిమానులు రావడం ఆనవాయితీగా మారింది. షర్మిల పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించి కుమ్మరాంపల్లె, వేంపల్లె మీదుగా కొనసాగనుంది.

తాజా వీడియోలు

Back to Top