గ్రామాల్లో బెల్టు షాపులన్నీ రద్దు

యలమంచిలి (విశాఖ జిల్లా):

‘గ్రామాల్లోని అనేక మంది యువకులు, పిల్లలు మద్యం తాగుతూ కనిపిస్తున్నారు. మద్యం వల్ల దారి తప్పుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంది. రెండు నెలల్లో మన సంక్షేమ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో బెల్టు షాపులే లేకుండా రద్దు చేస్తా. కేవలం నియోజకవర్గ కేంద్రంలో ఒకే ఒక్క దుకాణం ఉంటుంది. స్టార్ హోటళ్లలో ఉంటుంది. అక్కడ కూడా అందుబాటులో లేని ధరల్లో ఉంటుంది. గ్రామాల్లో అక్రమ మద్యాన్ని నివారించేందుకు అదే ఊరికి చెందిన 10 మంది మహిళలనే పోలీసులుగా నియమిస్తా’ అని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘వైయస్ఆర్ జనభేరి’ ఎన్నికల ప్రచార యాత్ర‌లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి బుధవారం విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాల్టీలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు.

సంతకాలతో రాష్ట్ర చరిత్రను మారుస్తా :

'మరో రెండు నెలల్లో అధికారంలోకి వస్తా. అప్పుడు ఐదు సంతకాలు చేస్తా. వీటితో రాష్ట్ర చరిత్రనే మార్చేస్తా.  మొదటి సంతకం అక్కా చెల్లెళ్ల కోసం పెడతా. ప్రస్తుతం అక్కా చెల్లెళ్లు పనికి వెళ్తే రూ.150 వస్తుంది. ఇది మూడు రోజుల తిండికి సరిపోతుంది. నాలుగో రోజు మళ్లీ పనికి పోతేనే కడుపు నిండుతుంది. అందుకే అక్కా చెల్లెళ్లు ఆరో తరగతి, ఏడో తరగతి చదువుతున్న తమ పిల్లలను పనికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మళ్లీ రూ.150 వస్తే అయిదో రోజు తిండి దొరకుతుందని. ఏ అక్కాచెల్లీ కూడా జీవితంపై భరోసా లేకుండా బతకాల్సిన పని ఇక లేదు. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించండి. వారిని ఇంజనీరుగా, డాక్టర్‌గా నేనే చేస్తా. ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిషు మీడియం పెడతా. బడికి పంపిన ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1,000  తల్లి ఖాతాలో జమ చేస్తా. ఆ వెయ్యి చేతికి వస్తే ఆ నెల ఎలా బతకాలి అనే బాధ ఉండదు. అప్పుడే పిల్లల చదువులపై అక్కా చెల్లెళ్లకు ధ్యాస మరింత పెరుగుతుంది' అని హామీ ఇచ్చారు.

'రెండో సంతకం అవ్వా తాతల కోసం పెడతా. వయసు, ఆరోగ్యం సహకరించకపోయినా వృద్ధులు కూలిపనికి వెళ్తున్నారు. వీరెవరిని కదిలించినా ‘మీ నాయన పుణ్యాన మా పింఛన్ రూ.200కు పెరిగింది. రెండు‌ పూటలా భోజనం చేస్తున్నాం. కానీ ఇవి కూడా సరిపోక పనికి పోతున్నాం’ అంటున్నారు. అందుకే పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడేలా ప్రతి అవ్వా తాతలకు పనులకు పోయే పరిస్థితి లేకుండా మూడు పూటల భోజనం చేసేలా పింఛన్‌ను రూ.700చేస్తా' అన్నారు. 'మూడో సంతకం రైతన్నల కోసం పెడతా. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీరికి గిట్టుబాటుకు, మద్దతు ధరకు భరోసా ఇస్తున్నా. రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతా' అని చెప్పారు.

'నాలుగో సంతకం మళ్లీ అక్కా చెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా అక్కా చెల్లెళ్లకు అమ్మ ఒడి పథకం ద్వారా కొత్త జీవితం ఇస్తాం. ప్రస్తుతం వీరంతా నెలకు రూ.2వేల డ్వాక్రా రుణం కట్టడానికి తమతో పాటు పిల్లలను పనికి పంపుతున్నారు. ఈ పరిస్థితి రాకుండా తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా. ఈ రుణాలు రూ.20వేల కోట్ల దాకా ఉన్నాయి. ఏదోలా కిందా మీదపడి అక్కా చెల్లెళ్లకు న్యాయం చేస్తాం' అన్నారు. 'ఈ రోజు ఏ గ్రామానికి పోయినా అన్నా... నాకు రేషన్ కార్డు రావడం లేదు.. పింఛ‌న్ రావడం లేదు.. ఆరోగ్యశ్రీ కార్డు రావడం లేదు.. అనే మాటలు ఇంకా వినిపిస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఎవరూ ఏ కార్డు కోసం తిరగక్కర్లేదు. మీ వార్డు, గ్రామంలోనే ఆఫీ‌స్ తెరుస్తా. కంప్యూటర్లు, లామినేష‌న్ పెట్టి అడిగిన వారికి అడిగిన కార్డు 24 గంటల్లో ఇస్తా‌' అన్నారు.

ఓటేసే ముందు మిమ్మల్సి మీరే ప్రశ్నించుకోండి :
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు ప్రజా సంక్షేమం కోసం పనిచేశారో గుర్తు తెచ్చుకోండి. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో మహానేత వైయస్ఆర్ చెప్పారు. వై‌యస్‌లా మంచి సీఎంను ఎంచుకోవడానికి సమయం ఇది. ఇప్పటికీ చంద్రబాబు పాలనను గుర్తుకు తెచ్చుకుంటే చంటిపిల్లలు కూడా ఏడుస్తారు. చంద్రబాబు పాలనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చదువుల పెట్టుబడుల కోసం ఇళ్లు, పొలాలు కూడా అమ్ముకున్నారు. ఆ రోజుల్లోనే ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్టగా మారారు. నిజాయితీ అనే పదానికి బాబుకు అర్థం తెలీదు. రూ.2 కిలో బియ్యాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలతో తనకు సంబంధం లేదనే రీతిలో ఐదు రూపాయల పావలాకు పెంచేశారు. అంగన్‌వాడీలు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు. కష్టాల్లో ఉన్న రైతులకు వడ్డీ మాఫీ చేసి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా వైయస్ఆర్ అడిగితే కరెంటు వైర్లను చూపించి రైతులకు ఉచిత విద్యు‌త్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా నేను అబద్ధపు రాజకీయాలు చేయను. అబద్ధాలు చెప్పి విశ్వసనీయతను దెబ్బతీసుకోలేను. మాట ఇస్తే తప్పను’‌ అన్నారు.

Back to Top