మెల్బోర్న్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఆస్టేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. మెల్బోర్న్లోని మెడీనా హోటల్లో వైయస్ అభిమాన ప్రవాసాంధ్రులు ఆయన తృతీయ వర్ధంతిని పురస్కరించుకుకుని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'మా రాజు' పేరిట వైయస్ రాజశేఖరరెడ్డిపై సాక్షి టివి నిర్మించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
వర్ధంతి సభకు హాజరైన వారికి రమణారెడ్డి కంజుల స్వాగతం చెప్పారు. వైయస్ జీవితం ప్రాముఖ్యాన్ని వివరించారు. ప్రజల గుండెలను వైయస్ స్పృశించారని ఆయన అన్నారు. వైయస్లోని అనుపమాన ధైర్యసాహసాల గురించి, నాయకత్వ లక్షణాల గురించి జయదీష్, నవ చైతన్యారెడ్డి వివరించారు. లక్షలాది మందిని వైయస్ తన కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారని వారన్నారు. పేదలు, వికలాంగులు తదితర అణగారిన వర్గాలకు వైయస్ ఆత్మబంధువు అయ్యారని వారు ఘనంగా నివాళులు అర్పించారు.
వైయస్ వంటి మహా నాయకుడు ఇంతకు ముందు జన్మించలేదు, మళ్లీ పుట్టబోరని పుల్లారెడ్డి, జీవన్, శివ, ప్రసాద్ అన్నారు. వైయస్ లేని లోటును ఎవరూ పూరించలేరని, ఆయన వంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఇంతకు ముందు ఎవరూ లేరని వారు అంజలి ఘటించారు.
మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తృతీయ వర్ధంతిని అమెరికాలోని అట్లాంటాలోని ప్రవాసాంధ్రులు నిర్వహించారు. సెప్టెంబర్ 8న ఈ కార్యక్రమం జరిగింది. వైయస్ నాయకత్వ లక్షణాలను, వైయస్తో తమకు గల అనుబంధాన్ని ఆహూతులు గుర్తు చేసుకున్నారు. వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రాగి ముద్దలు పెట్టి నివాళులు అర్పించారు. వైయస్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.