విజయవాడ: కత్తి మహేశ్ మరణంపై విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ తీవ్ర గాయాలపాలై, చికిత్స పొందుతూ మరణించారు. అయితే, కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు విచారణ చేపట్టి, నాడు కారు నడుపుతున్న సురేశ్ ను విచారించారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. కత్తి మహేశ్ కుటుంబానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని, ఆయన చికిత్స కోసం రూ.17 లక్షలు మంజూరు చేసిందని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.