గడ్డం తొలగిస్తుందట అడ్డం

ఏమైనా అనుకోండి దొంగ దీక్షల ఐడియాలు కావాలంటే టిడిపి వారిని సంప్రదించండి. కొత్త కొత్త, కొంగొత్త, చిత్ర విచిత్ర దీక్షలు చేయడంలో వారికి వారే సాటి. వారికెవ్వరూ లేరు పోటీ. టిడిపి అధినేత చంద్రబాబు నుంచి మొదలుకొని ఆ పార్టీ ఎంపి, ఎమ్మెల్యేల వరకూ అందరూ ఇందులో సిద్ధ హస్తులే. నిరాహారం కాని నిరాహారదీక్ష, నీరసం రాని నిరసన, ధర్మం లేని ధర్మపోరాటం, లక్ష్యం లేని ర్యాలీ ఇవన్నీ ఒక్క టిడిపి తప్ప మరే పార్టీ చేయలేదు. ఇక సిఎమ్ రమేష్ కొత్తగా చేస్తున్న గడ్డం దీక్షం కడప స్టీలుకు ఎదురైన గండాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుందట.
నిన్నటి దాకా కడప స్టీలు ప్లాంటు కోసం అవిరామంగా బరువు తగ్గని నిరాహార దీక్ష చేసిన సిఎమ్ రమేష్ గారు నేడు మరో కొత్త దీక్షకు పూనుకున్నారు. అదేదో నీళ్లు తాగకుండా నీరుపవాసం, గాలి పీల్చుకోకుండా ఆత్మత్యాగమో అనుకునేరు కాదు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగాకే గడ్డం తీస్తా ఇదే నా అరివీర భయంకర రణన్నినాద దీక్ష అని ప్రతిన పూనారు సిఎమ్ రమేష్. అది విని టిడిపి అభిమానులు, తెలుగు ప్రజలు ఔరా ఈ మనిషికి ఎంతటి గుండె ధైర్యం అని గుండెలు బాదుకున్నారు. కేంద్రం కనుక కడపకు ఉక్కు పరిశ్రమ తేకపోతే సిఎమ్ రమేష్ గడ్డం తీయకుండా ఉండిపోతే...అని భవిష్యత్తును రీలేసుకుని చూసుకునే పనిలో పడిపోయారు. నెల, రెండు నెలలు, నాలుగు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి కూడా ఉక్కు ఫ్యాక్టరీ రాకపోతే బారెడు పొడవు గడ్డంతో యోగివేమనకు తాతలా సిఎమ్ రమేష్ తయారౌతారేమో అని బెంగ పెట్టుకున్నారు. 
అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం అంత కంగారు పడాల్సిందేమీ లేదని హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వానికి కేవలం రెండు నెలలే డెడ్ లైన్ విధించారట. ఆ లోపు కనుక కేంద్రం కడపకు స్టీల్ ఫ్యాక్టరీ సాంక్షన్ చేయకపోతే ఆ తర్వాత జరిగేదే వేరని హెచ్చరించారట. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారూ అంటే, కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ కట్టను అంటే సగం ఖర్చు తాము భరిస్తామని వీరావేశంగా సమాధానమిస్తారట. ఒకవేళ అప్పుడు కూడా కేంద్రం కడప స్టీలు ఫ్యాక్టరీపై వెనకడుగువేస్తే ముఖ్యమంత్రే స్వయంగా ముందడుగు వేసి కడప స్టీలు ఫ్యాక్టరీ కలను స్వయంగా నిజం చేస్తారట. అందుకు తానే రంగంలోకి దిగి, ఫ్యాక్టరీ నిర్మాణానికయ్యే ఖర్చంతా తామే అనగా ప్రభుత్వమే భరించి కట్టేస్తారట. లేదా ఏ ప్రైవేటు కంపెనీలతోనో కట్టించేస్తారట. అంటే ప్రభుత్వ అంచనాల ప్రకారం ఎటు తిరిగీ రెండు నెలల్లో స్టీలు ఫ్యాక్టరీ మొదలైపోతుందన్నమాట. మోదీ ఒప్పుకుంటే కేంద్రం నుంచి, కాకుంటే చంద్రబాబు తరఫున కడప స్టీలు ఫ్యాక్టరీ శంకుస్థాపన ఖాయం. కనుక సిఎమ్ రమేష్ గడ్డం గురించి తెగ వర్రీ అవ్వక్కర్లేదంటున్నారు సీనియర్ నాయకులు. అయితే సామాన్యులకు కొన్ని డౌట్లు వస్తాయి గదా! కేంద్రం, లేక రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కడప స్టీల్ ప్లాంటు కట్టడానికి కంకణ బద్ధం అయితే మరి సిఎమ్ రమేష్ గడ్డం దీక్ష ఎందుకు చేస్తున్నట్టు...? రెండు నెలలు షేవింగ్ ఖర్చులు మిగుల్చుకోడానికని తొక్కలో ఆన్సర్ చెప్పకండేం. 


 
Back to Top