అనంతపురం: రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి... నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ఈ ప్రాంతానికి ద్రోహం చేయడమే అని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా వైయస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆయన డిమాండు చేశారు. బుధవారం అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైయస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా పొందాలంటే 10 శాతం సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. వైయస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సిందే. చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు వైయస్ జగన్ అంగీకరించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైయస్ఆర్ కృషి వల్లే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు. 45 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించిన ఘనత వైయస్ఆర్ దే. హంద్రీనీవా కాలువల వెడల్పు చేసిన తర్వాతే.. లైనింగ్ పనులు చేపట్టాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి.. నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ద్రోహం చేయడమే అవుతుంది అంటూ తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.