తాడేపల్లి: మన సంప్రదాయం ప్రకారం ఎన్టీ రామారావు కూతురు కొడుకైన నారా లోకేష్, ఏ విధంగా ఆయనకు వారసుడు అవుతాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. మహానాడులో ఎన్టీఆర్ వారసుడు అంటూ టీడీపీ నేతలు చేసుకున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు లక్ష్మిపార్వతి ఓ వీడియోను వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీపార్వతి ఏమన్నారంటే.. `నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసులు అవుతారు తప్ప, వేరే కుటుంబాల వారు కారు కదా? అందుకే నారా కుటుంబం నుంచి వచ్చిన లోకేష్, ఎప్పటికీ ఎన్టీఆర్ వారసుడు కాలేడు. చంద్రబాబు అవినీతి రాజకీయానికి మాత్రమే లోకేష్ వారసుడు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు, అఘాయిత్యాలకు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. ఇలాంటి దగుల్బాజీ రాజకీయం చేసే వారు ప్రపంచంలో ఈ తండ్రీకొడుకులు తప్ప ఇంకొకరు ఉండరు. అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో అడుగుపెట్టడానికే వణికిపోతున్నారు. ముంబై నుంచి సినీ నటిని రప్పించి, ఆమెతో ఆరోపణలు చేయించి.. ఆమెను అడ్డం పెట్టి జిందాల్ కంపెనీ రాకుండా తరిమేశారు`అంటూ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు.