టెన్త్ ప‌రీక్ష‌ల‌ మూల్యాంక‌నంలో ప్ర‌భుత్వం విఫ‌లం

ఫ‌లితాల్లో 1,15,874 మంది విద్యార్థులు ఫెయిల్‌

రీవేల్యూష‌న్ త‌ర్వాత 60 శాతం మంది ఉత్తీర్ణ‌త‌

నారాయ‌ణ కాలేజీల్లో అడ్మిష‌న్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంక‌నం

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్ష‌ణం రాజీనామా చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ ర‌విచంద్ర డిమాండ్

 తాడేప‌లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ ర‌విచంద్ర‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఆయనేమన్నారంటే...

కూటమి పాల‌న‌లో విద్యావ్య‌వ‌స్థ పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. హాఫ్ ఇయ‌ర్లీ ప‌రీక్ష‌ల నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల వ‌ర‌కు పేప‌ర్ లీకేజీ జ‌ర‌గ‌కుండా ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల ప్రక్రియ  నిర్వ‌హించ‌లేక ప్ర‌భుత్వం చేతులెత్తేసింది. ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల్లోనూ పేప‌ర్ లీక్‌ల‌తో ప్ర‌భుత్వం అభాసుపాలైంది. ఇదిలా ఉంటే చివ‌రికి పేప‌ర్ మూల్యాంక‌నంలోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిల‌య్యారు. వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్‌, రీ వేల్యూష‌న్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది మా జ‌వాబు ప‌త్రాలను త‌ప్పుల త‌డ‌క‌గా మూల్యాంక‌నం చేశార‌ని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఎస్సెస్సీ బోర్డు చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థమం. రీవేల్యూష‌న్, రీకౌంటింగ్‌ త‌ర్వాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైన‌ట్టు ఎస్సెస్సీ బోర్డు ప్ర‌క‌టించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంక‌న విధానం ఎంత లోప‌భూయిష్టంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మోక్షిత అనే విద్యార్థినికి సాంఘిక‌శాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి.  బాప‌ట్ల‌లో మ‌రో విద్యార్థికి సాంఘిక శాస్త్రంలోనే 26 మార్కులొస్తే రీవెరిఫికేష‌న్ త‌ర్వాత 96 మార్కులొచ్చాయి. ఏలూరులో ఒక విద్యార్ధి రాసిన  జ‌వాబు ప‌త్రాల‌న్నీ మూల్యాంక‌నం చేయ‌కుండా 14 మార్కులే వేశారు. రీ వేల్యూష‌న్‌లో ఆ విద్యార్ధినికి 86 మార్కులొచ్చిన‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు. 

లోకేష్‌ అసమర్థతకు టీచ‌ర్లు బ‌లి

రాష్ట్ర చ‌రిత్ర‌లో 22 రోజుల్లోనే పేప‌ర్ మూల్యాంక‌నం పూర్తి చేశామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం గొప్ప‌గా ప్ర‌క‌టించుకుంది. తీరా ఫ‌లితాలు చూశాక విద్యార్థుల త‌ల్లిదండ్రులు ల‌బోదిబోమంటున్నారు. త‌ప్పుడు త‌డ‌కలుగా మూల్యాంక‌నం చేసి 1,15,874 మంది విద్యార్థులు ఫెయిలైన‌ట్లు ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. రీవేల్యూష‌న్ లో 66వేల మందికిపైగా విద్యార్థులు పాస‌వ్వడంతో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. మూల్యాంక‌నంలో టీచ‌ర్ల‌కు టార్గెట్లు పెట్టి వేధించి విద్యార్థుల జీవితాల‌తో ఈ ప్ర‌భుత్వం ఆడుకునే ప‌రిస్థితి తీసుకొచ్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ త‌న వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకునేందుకు టీచ‌ర్ల‌ను దోషులుగా చూపించి స‌స్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవ‌డం దుర్మార్గం. నారాయ‌ణ కాలేజీలో అడ్మిష‌న్లు పెంచుకునే వ్యూహంలో భాగంగానే హ‌డావుడిగా మూల్యాంక‌నం చేయించిన‌ట్టుగా తెలుస్తోంది. చివ‌రికి మూల్యాంక‌నంలో లోపాలు త‌లెత్త‌డంతో టీచ‌ర్లను బ‌లిచేశారు. విద్యావ్య‌వ‌స్థపై క‌నీస అవ‌గాహ‌న లేకుండా, ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌కుండా విద్యార్థుల జీవితాల‌తో లోకేష్ ఆడుకుంటున్నాడు. మూల్యాంక‌నంలో జ‌రిగిన త‌ప్పుల‌కు, లోపాల‌కు మంత్రి లోకేష్ బాధ్య‌త వ‌హించాలి.

Back to Top