అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వీటిని ఇంకా ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లడం, సెలబ్రేషన్ లాగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఇచ్చిన దానికి వడపోత కాకుండా శాచురేషన్ పద్ధతిలో సంతృప్త స్థాయిలో ఇస్తున్నారన్నారు. పింఛన్లు దాదాపు 66 లక్షల మందికి ఇస్తున్నారన్నారు. చాలా కుటుంబాలు వారి జీవితాలే మారిపోయాయని చెప్పారు. ఆసరా, చేయూత, పింఛన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అందిస్తున్న నేపథ్యంలో దానిపై అందరి భాగస్వామ్యం ఉండేలా పార్టీ యంత్రాంగం, ఎమ్మెల్యేలు, లబ్ధిదారులందరినీ భాగస్వామ్యం చేస్తున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సజ్జల ఇంకా ఏం మాట్లాడారంటే.. విజయవాడలో "అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కూడా అందరి భాగస్వామ్యం ఉండేలా చేస్తాం. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. అభ్యర్థులు ఎక్కడైనా మార్పులు జరిగి ఉంటే వారిని పరిచయం చేయడం, బలోపేతం చేయడం, పార్టీ మొత్తం వారితో సమన్వయం చేయడంపై చర్చ జరిగింది. అభ్యర్థుల మార్పు వీలైనంత త్వరగా జరిగిపోతుంది. అభ్యర్థుల మార్పు ప్రకటించిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. ఏ కారణాల వల్లనైనా ఎవరైనా పక్కకు వెళ్తుంటే, ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు అనుకుంటే అలాంటి వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాం. మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్లో ఉన్నాం. ఇమడలేని వారు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు అడ్డంగా కొంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా.. జరగనీ, కొత్తవారు వస్తారనే ఉద్దేశంతోనే వైయస్ జగన్మోహన్రెడ్డి చూశారు. ఇలాంటి చిన్న చిన్న వాటికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన వారి గురించి మేము కామెంట్ చేయదలచుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ మధ్య నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీ విధానాలకు కుదరడం లేదనుకొనే వారు పోతుంటారు. ఇలాంటి వారు ఉంటే పార్టీకి పోనుపోనూ ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన విధానాన్ని గమనిస్తే, పార్టీలోంచి ఎవరైనా వారి ప్రయోజనాల కోసం వెళ్తుంటే దాన్ని అంతే బ్రాడ్ మైండ్తో చూడటం అనేది అలవాటు అయ్యింది. ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక అందులో మార్పులు జరిగినప్పుడు కింద వాళ్లకు కొత్తవారితో అడ్జస్ట్ కాగలమా అనేది ఒక డైలమా రావచ్చు. అప్పుడు అసంతృప్తులు రావొచ్చు. వారికి నచ్చజెప్పేందుకే ఈ యంత్రాంగం అంతా నాతో సహా రీజనల్ కోఆర్డినేర్లు, జిల్లా అధ్యక్షులు పని చేస్తున్నాం. చాలా వరకు విజయవంతం అవుతాయి. మా విశ్వాసం ఏంటంటే.. వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇన్నాళ్లూ 90 శాతం వరకు పదవులకు మాత్రమే కాకుండా లాంగ్టర్మ్ జర్నీ కోసం నచ్చజెబుతున్నాం" అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.