కుప్పంలో విధ్వంసకర ఘటనకు తెర తీసింది టీడీపీనే

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

కుప్పం ఘటనకు చంద్రబాబే బాధ్యుడు..బోన్‌లో నిలబడి సమాధానం చెప్పాల్సిందే

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కకావికలమైంది

చంద్రబాబు పాలనలో కుప్పం ప్రజలు విసిగిపోయారు

వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్ర

తాడేపల్లి:  కుప్పంలో విధ్వంసకర ఘటనలకు తెర  తీసింది టీడీపీ పార్టీనేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇందుకు బాధ్యుడని, ఈ ఘటనకు బోన్‌లో నిలబడి సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కుప్పంలో టీడీపీ బరితెగించిందని, చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కుప్పంలో టీడీపీ అరాచకంపై బాబు సమాధానం చెప్పాలి
            చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని కొల్లుపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం నుండి టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళ వద్ద ఉన్నపార్టీ  జెండాలను టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా తొలగించటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయటం, టీడీపీ నేతలు, కార్యకర్తలు దుడ్డు కర్రలు పట్టుకుని గ్రామంలో ఊరేగింపులు చేయడం.. రాజశేఖర రెడ్డిగారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం.. ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఆ వీడియో క్లిప్స్ ను సజ్జల రామకృష్ణారెడ్డిగారు మీడియా ముందు ప్రదర్శించారు. 

చంద్రబాబు సాక్షిగా జరిగిన ఈ ఘటనలన్నింటికీ ఆ పార్టీ అధ్యక్షుడిగా, వీటికి సమాధానం చెప్పాల్సిందీ, సంజాయిషీ ఇవ్వాల్సిందీ చంద్రబాబే. అది చేయకపోగా,  మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు.. నిన్నా, ఈరోజు కూడా దాడులు టీడీపీ వాళ్ళే చేసి, బరితెగించి దౌర్జన్యాలు చేసి, విధ్వంసకర ఘటనలు ప్రోత్సహించేవిధంగా, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా మళ్ళీ సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు నటనాచాతుర్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 

- ఇది ఈరోజే కాదు.. గతంలోనూ చాలాసార్లు కుప్పంలో ఇదే పరిస్థితి. బాబు వస్తున్నాడు అని మా పార్టీ వారు ఎవరైనా బ్యానర్లు, జెండాలు కడితే అడగొచ్చు. ముందుగా కట్టుకున్న జెండాలు, బ్యానర్ల మీద టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తారా..?. మా జెండాలను తొలగిస్తారా..? ఏమిటి మీ అరాచకం, ఏమిటి మీ బరితెగింపు..?. 
ఎంపీడీవో ఆఫీసు మీద దాడి, వైఎస్ఆర్ గారి విగ్రహం కూల్చడం, స్థానిక ఎంపీపీ మీద దాడి చేయడం.. వీటన్నింటినీ రాజకీయం అంటారా..? పచ్చ రౌడీ మూకల గూండాయిజం అంటారా..?

- ఇది అన్యాయం అని నిరసన తెలియజేసినందుకు.. ప్రశ్నించినందుకు టీడీపీ వాళ్ళు దాడులు చేస్తే.. వారి దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.  

- వాస్తవం ఇలా ఉంటే, ఈరోజు చంద్రబాబు చేసిన డ్రామా, సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు, పోలీసులను పట్టుకుని డొక్క చీలుస్తాం అంటూ హెచ్చరించే మాటలు, మేం అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీసులను మేమేదో వాడుకుంటున్నట్లు అర్థం వచ్చేలా ఆయన హెచ్చరికలు ఇవన్నీ చూస్తే.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి అనిపిస్తుంది. 

- శాశ్వతంగా ఇక అధికారం రాదన్న భావనలోనుంచి వచ్చే ఆక్రోశం, నిరాశ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ లో ఇలా దాడులు చేస్తారా.. అసలు ప్రజలను రెచ్చగొట్టి, తిట్టడానికి చంద్రబాబుకు ఏ హక్కు ఉంది.?. మళ్ళీ, సానుభూతి కావాలంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటు. 

కుప్పంలో బాబు భ్రమలన్నీ కకావికలం
        కుప్పంలో 30 ఏళ్ళకు పైగా దొంగ ఓట్లు వేయించుకుంటూ, తన మనుషులను పెట్టుకుని, తన ఉక్కు పాదాల కింద వ్యవస్థలను పెట్టుకుని నడుపుతున్న చంద్రబాబుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటికి బ్రేక్ పడటంతో, నిజమైన పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజలు ఆశీస్సులు అందజేస్తుంటే.. ఆయన భ్రమలన్నీ కకావికలం అయ్యాయి.  చంద్రబాబు ప్రాణం కుప్పంలో ఉంటే.. దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బకొట్టింది. దాంతో బాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది.  

- మొన్నటి వరకు 174 సీట్లు గెలుస్తాం అన్న దగ్గర నుంచి, ఇప్పుడు 175 స్థానాలకు 175 గెలవగలం అని మాకు వచ్చిన నమ్మకంతో.. ఇప్పుడు  చంద్రబాబు ధర్మపోరాటం అంటున్నాడు. ఎన్నిసార్లు ఆయన ధర్మపోరాటాలు చేస్తాడో..?

కుప్పం ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు
        చంద్రబాబు కబంధ హస్తాలనుంచి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కుప్పం ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ లు 86 శాతం, ఎంపీటీసీలు 66కు 63, జెడ్పీటీసీలు 4, మున్సిపాలిటీ.. ఇవన్నీ గెలుచుకున్నాం. ఇవన్నీ ఒకసారి జరిగిన ఎన్నికలు కావు..  దఫదఫాలుగా ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు మూడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కుప్పం ప్రజలు టీడీపీ మీద, చంద్రబాబు మీద విసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇచ్చారు. 

- 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు పాలనపై విసిగెత్తి.. ఆయనను, ఆయన పార్టీని చెత్త  బుట్టలో విసిరిపారేసినట్టే.. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబును కుప్పంతో సహా రాష్ట్రమంతా మరోసారి రిజెక్ట్ చేశారు. కుప్పంలో స్థానం లేదు అని బాబుకు చెల్లు చీటి ఇచ్చారు.

- 30 ఏళ్ళపాటు కుప్పం నియోజకవర్గంపై.. చంద్రబాబు పసుపు రంగు పులిమితే.. అటువంటి చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతంపైగా  గెలిచి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడు రంగులు వచ్చే సరికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా అదరిస్తారు. వారికి ఆ హక్కు ఉంది. ప్రజల అభిప్రాయాన్ని ఎవరైనా గౌరవించాలి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నీవు కనీస మర్యాదలేకుండా.. ప్రజలపై అటాక్ చేస్తావా..?

- టీడీపీ చేసిన దౌర్జన్యానికి నిరసనగా,  ఈరోజు మా పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేశారు అంటూ రచ్చ చేస్తారా..?. అసలు అన్న క్యాంటీన్ ఎక్కడ ఉంది..?. వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తుంటేనే.. చంద్రబాబు లేని ఆవేశాన్ని తెచ్చుకుని, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ, రోడ్డు మీద బైఠాయింపులు, బెదిరింపులా..?

పక్కా ప్లాన్ ప్రకారమే.. కుప్పంలో టీడీపీ అరాచకం
        కుప్పం పర్యటనకు వెళ్ళేటప్పుడే చంద్రబాబు పక్కాగా ప్లాన్ చేసి ఉంటాడు. అక్కడకు వెళ్ళేలోపు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గిల్లి తగవులు పెట్టుకున్నారు. ఇందుకు ప్రతిస్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రియాక్ట్ అవ్వగానే.. వాళ్ళే దాడులు చేయించి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, ఇదంతా అధికారపక్షం చేసిందని, మళ్ళీ వాళ్ళే ప్రజల ముందుకు వచ్చి సానుభూతి కోరదాం.. అనే దరిద్రపు గొట్టు ఆలోచనతోనే ఇదంతా చేశారు తప్ప..  బాబుకు ప్రజల గురించి ఆలోచన లేదు.

- స్వయానా చంద్రబాబు చిన్నాయనే.. ఆరోజు రాజశేఖరరెడ్డి గారి నుంచి కొంతైనా నేర్చుకో అని చంద్రబాబుకు హితవు చెప్పారు. ప్రజలకు సేవ చేస్తే.. ఎవరైనా గుర్తిస్తారు.  జగన్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి, శిశుపాలుడిలా చంద్రబాబు చేసిన తప్పులన్నీ లెక్కపెట్టి ప్రజలకు చెప్పారు. అవన్నీ వాస్తవాలు  కావడంతో జనం నమ్మి జగన్ గారిని అధికారంలో కూర్చోబెట్టారు.  

- ఈరోజు అవే ఆరోపణలు నేను చేస్తే.. ఎందుకు జనం నమ్మరు అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. ఇందులో సింపుల్ లాజిక్ ఏమిటంటే .. చంద్రబాబు చెప్పేవి నిజాలు కావు కాబట్టి జనం నమ్మరు. ఆయన తప్పుడు పనులు చేసి, అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రజలను  రాచి రంపాన పెట్టావు కాబట్టి  ఎన్నికల్లో నిన్ను విసిరి చెత్త బుట్టలో వేశారు.

చొక్కాలు చించుకుని డ్రామాలు ఆడితే జనం నమ్మరు బాబూ..?
        దివంగత నేత, రాజశేఖరరెడ్డిగారి కంటే మిన్నగా.. రెండు అడుగులు ముందుకు వేసి, దశాబ్దాలుగా జరగని సంస్కరణలు తెచ్చి, గతంలో ఎప్పుడూ లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. జగన్ గారు  పరిపాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారు కాబట్టే.. వాటి ఫలితాలను  ప్రజలు అనుభవిస్తున్నారు కాబట్టి, మా ఆశీస్సులు మీకే అంటూ ప్రతి ఎన్నికల్లోనూ జగన్ గారికి మద్దతు పలుకుతుంటే...  అది చూడలేక, నీవు చొక్కా చించుకుని డ్రామాలు ఆడితే ఎలా..?

- డైలాగులు, ఇటువంటి డ్రామా సీన్స్..  స్క్రీన్ మీద బాగుంటాయి. ఇది రియాల్టీ.. రియాల్టీని చంద్రబాబు మిస్ అవుతున్నందువల్లే.. ఆయనను ఎవరూ నమ్మడం లేదు. చెప్పిన అబద్ధాలనే పదే పదే చెప్పటం చంద్రబాబుకు అలావాటుగా మారింది. చంద్రబాబు చిల్లర రాజకీయాలు, చిల్లర ఎత్తుగడలు ఎక్కడైనా నడుస్తాయేమోగానీ.. ఇక్కడ నడవవు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చి చెప్పారు. 

- లైట్స్ ఆన్.. కెమెరా.. యాక్షన్.. అన్నట్టుగా చంద్రబాబు రాజకీయాలను మార్చాడు. ఇతనికితోడు, స్క్రీన్ మీద నటించే మరొకాయన తోడై, వీరి చిల్లర వేషాలు ప్రజలు ఇంకా భరించాల్సి రావడం మరింత దురదృష్టం. 

30 ఏళ్ళల్లో ఎన్నిసార్లు వెళ్ళాడో.. మూడేళ్ళలో అన్నిసార్లు బాబు కుప్పం వెళ్ళాడు..
        గడిచిన 30-35 ఏళ్ళలో చంద్రబాబు ఎన్నిసార్లు అయితే కుప్పం వెళ్ళేడో.. ఈ మూడేళ్ళలోనే కుప్పం అన్నిసార్లు వెళ్ళాడు. గతంలో ఆయన పీఏలే అక్కడ రాజ్యం ఏలి వుంటారు. ఆయన ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలో బాబుకు ఇన్నేళ్ళుగా ఇల్లు లేదు.. ఈరోజు ఆఫీసు ప్రారంభించాడు అట. అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు.

- 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఈరోజు కుప్పం బ్రాంచ్ కెనాల్ గురించి మాట్లాడతాడు. ఇప్పటివరకు అధికారంలోకి రాని వారు మాట్లాడితే ఓకే. ఇన్నేళ్ళు అధికారంలో ఉండి కూడా నా నియోజకవర్గానికి అది చేయలేదు, ఇది చేయలేని అని సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

- జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పానని పదే పదే మాట్లాడే వ్యక్తి.. ఈ దాడులేంటి...?. తెలుగు దొంగల ముఠాలా, రౌడీల ముఠా కాకపోతే.. వీళ్ళు చేసిందేమిటి..?

- వీళ్ళను ప్రజలు ఎలాగైనా రిజెక్ట్ చేస్తారు. తాత్కాలికంగానైనా, ఇటువంటి కుట్ర రాజకీయాలతో ప్రశాంతంగా ఉన్న సమాజంలో చిచ్చు  పెడుతున్నారు.  

- మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే.. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని మాట్లాడుతున్న బాబు.. అన్ని లక్షల మంది కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నారో..  ప్రపంచం అంతా ఉన్నారో.. ఆయనకే తెలియాలి. ఏపీలో అయితే ఉండరు.  చంద్రబాబే ఒక పరాన్న జీవి. అలాంటి పరాన్న జీవులు మాత్రమే చంద్రబాబుకు అండగా ఉంటారు. ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, నిజమైన కార్యకర్తలు ఎవరూ బాబుకు మద్దతుగా ఉండరు. 

- ప్రజల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించడు. ప్రజల్లో ఉండే నాయకుల్ని గౌరవించడు. ఎంతసేపటికీ, కుళ్ళు, కుతంత్రాలు చేసి అధికారంలోకి ఎరా రావాలి  అని పన్నాగాలు పన్నడం తప్ప. 

- ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడూ పోలీసులను వాడుకోవాలనుకోరు.  చంద్రబాబు మాదిరిగా ఓటుకు కోట్లు కేసులో దొరికినప్పుడు మాట్లాడినట్టు.. "నీకు ఏసీబీ ఉంది.. నాకు ఏసీబీ ఉంది..నీకు ఇంటెలిజెన్సీ ఉందీ.. నాకూ ఉంది.. నీకు  పోలీసులు ఉన్నారు.. నాకూ పోలీసులు ఉన్నారు" అని ఎప్పుడూ చెప్పలేదు కూడా. 

- పోలీసుల మీదనో, వ్యవస్థలను మేనేజ్ చేయడం మీదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడి గెలవదు. 

- నిరంతరం ప్రజల  కోసం పనిచేస్తూ,  ప్రజల విశ్వాసం చూరగొనడానికి, వాళ్ళల్లో మమేకమై పనిచేసే కార్యకర్తలు, నాయకులు, వీరికి నాయకత్వం వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ మాది. 

- ప్రజాస్వామ్యంలో.. దౌర్జన్యకర రాజకీయాలుచేస్తే.. ఏదీ జరగదు. చంద్రబాబు చేసే అరాచక, సానుభూతి రాజకీయాలు తాత్కాలికమే అన్నది గుర్తు పెట్టుకోవాలి. 

- ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసింది చెప్పటం, భవిష్యత్తులో చేయాలనుకున్నవి చెప్పుకోవడమే మా పార్టీ సిద్ధాంతం. వేరే రకంగా పోవడం మాకు  చేతకాదు. 

14 ఏళ్ళు సీఎంగా చెప్పుకోవడానికి ఏ ఒక్క స్కీము అయినా ఉందా..?
        14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి, 1995 తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారో.. చెప్పుకోవడానికి ఒక్కటైనా మంచి ఉందా..? అంతెందుకు, 2014-19 మధ్యకాలంలో 5 ఏళ్ళ పరిపాలనలో నేను ఇది చేశాను, జగన్ గారు తీసేశారు, జగన్ గారికంటే భిన్నంగా, గొప్పగా నేను చేశాను అని చెప్పటానికి ఒక్కటంటే ఒక్క పథకం అయినా ఉందా..?. లేదు. 

- ఎప్పుడు అడిగినా.. నేను ఇప్పుడు మొదలుపెడతాను అని చంద్రబాబు అంటాడు. ముందుగా, చంద్రబాబు తన భ్రమలు వదిలించుకోవాలి. అంటుకట్టినట్టుగా, పవన్ కల్యాణ్, ఇతరులను అంటిపెట్టుకుని ప్రజల ముందుకు వెళ్ళినందు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. 

- ఇప్పటికైనా, ప్రజా జీవితానికి భంగం కలిగించకుండా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం సన్నగిల్లకుండా నడుచుకో చంద్రబాబూ.. అని చెబుతున్నాం. 

పవన్ తో ఇంకా రహస్య మైత్రి ఎందుకు..?
        గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వస్తున్న  ప్రజా స్పందనను చూసి.. మీ పప్పులు ఇక ఉడకవు అని అర్థం అయ్యాక, పొత్తుల కోసం వెంపర్లాడుతూ అంతా కట్టకట్టుకుని రావాలని చూస్తున్నారు. పవన్ కల్యాణ్ తో  ఇంకా రహస్య మైత్రి ఎందుకు.. బహిరంగంగానే పవన్ కల్యాణ్ తో, మీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరగొచ్చు కదా. 

- టీడీపీ ఆఫీసు నుంచి డిక్టేషన్ వస్తే.. పవన్ కల్యాణ్ తూ.చ. తప్పకుండా ఫాలో అవడం జరుగుతుంది. వీళ్ళ లక్ష్యం ఒక్కటే.. జగన్ గారిని అధికారం నుంచి దించేయాలన్నదే. ఇది కూడా పవన్ కల్యాణ్ నోటి నుంచి చంద్రబాబు అనిపించిన మాట.. వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం అంటే.. మొత్తం సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. అదే వారి లక్ష్యం. 

- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మార్క్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ ఏంటంటే.. సంక్షేమం.. సంక్షేమం ద్వారా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల గడప వద్దకే పరిపాలన.. పారదర్శకత.. ఇవీ జగన్ మోహన్ రెడ్డిగారు ఆచరణలో చూపిన మా పార్టీ లక్షణాలు. వీటికి మేము మాత్రమే పేటెంట్..

- ఇప్పటికే రూ. 1.70 లక్షల కోట్లు నేరుగా పేదల బ్యాంకు అకౌంట్లలో వేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఇవ్వడమే జగన్ గారి లక్ష్యం.  

-పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమిచెబుతున్నాడంటే.. పేదలకు వచ్చేవి ఏవీ మీకు ఉండవు. అది మా లక్ష్యం అని చెబుతున్నాడు. ప్రజల నోటి దగ్గర నుంచి వాటిని తీసేయాలనే భ్రమల్లో బహుశా వాళ్ళు బతుకుతున్నారు. 

- పవన్ కల్యాణ్ కు ఓపిక ఉంటే.. మా ఎమ్మెల్యే గడప గడపకు వెళుతున్నప్పుడు.. ఆయనతోపాటు వెళ్ళినా, లేకపోతే, ఎమ్మెల్యే లేకుండా వెళ్ళినా, ప్రజలే చెబుతారు. ఏం పథకాలు వారికి వస్తున్నాయి, ఏం రావటం లేదు అని.  శాచురేషన్ విధానంలో ఇస్తున్నాం. ఒక్కో ఇంటికి లక్షా, రెండు లక్షలు వివిధ పథకాల ద్వారా అందిస్తున్నాం. 

- అర్హత లేకుండా ఏమీ చేయలేం. కౌలు రైతులకు కూడా పథకాలు అందుతున్నాయి. ఏ కారణాల వల్ల అయినా, అడ్మినిస్ట్రేషన్ లో ఏ చిన్న లోపం ఉన్నా, దానిని కరెక్ట్ చేసుకోవడానికి మేము రెడీగా ఉంటున్నాం. 

- వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే.. మీకు మీరు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే..

- పైగా, మా స్ట్రాటజీ చెప్పం.. అంటున్నాడు. అసలు స్ట్రాటజీ ఏమిటో పవన్ కల్యాణ్ కు తెలిస్తే కదా.. అది వెనక ఉన్న చంద్రబాబుకు మాత్రమే తెలుస్తుంది.

- షిండే సీఎం కాలేదా.. నితేష్ సీఎం కాలేదా.. అని పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యే ఏడుకొండలు కావాలనుకుంటున్నాడా.. ? ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటమా..?

- నీకు స్టార్ డమ్ ఉంది కాబట్టి,నీవు మాట్లాడితే, పది మందిలోకి వెళుతుంది కాబట్టి, ఇన్ని అబద్ధాలు మాట్లాడటమా.. ? 

-  ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నయం ఎవరైనా కావొచ్చు.. మనకు మనం భ్రమల్లోకి వెళ్ళి.. ఇక్కడ నుంచే నేను శాసిస్తాను అనుకుంటే.. ఏమీ ప్రయోజనం ఉండదు. 

- జనంలోకి వెళ్ళొచ్చుగానీ.. ప్రజలను భ్రమల్లో తాత్కాలికంగా  పెట్టవచ్చుగానీ.. మీ కుట్రలన్నింటినీ తుత్తునియలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 

- జనం సరదాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం లేదు. స్క్రీన్ మీద వంద మందినో, రెండు వందల మందినో కొట్టేసి వచ్చిన నాయకుడు కాదు జగన్ గారు. ఆయన స్వతహాగా జనం నుంచి వచ్చిన నాయకుడు. 

- మేనిఫెస్టోలో చెప్పినవన్నీ..  95 శాతం అమలు  చేశామని చెబుతున్నాం. మిగతా 5 శాతం చేయలేకపోయాం, భవిష్యత్తులో చేస్తాం అని చెబుతున్నాం. 

- చెప్పనవి కూడా దీనికి అనుబంధంగా అమలు చేశాం..

- చిన్న పిల్లల నుంచి యువత, వృద్ధుల వరకు, శాచురేషన్ విధానంలో పథకాలను కంటిన్యూస్ గా అమలు చేస్తూనే ఉన్నాం. 

2014లో ఎందుకు అన్నా క్యాంటీన్లు పెట్టలేదు..?
         చంద్రబాబు లక్ష కోట్ల రుణ మాఫీ.. చంద్రన్న పేరుతో పెట్టుకున్న పథకాలు, అన్న క్యాంటీన్.. ఇలా ఏవేవో చెప్పాడు. అవన్నీ టీడీపీ పుట్టినప్పటి నుంచో.. లేక బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిస్టమేటిక్ గా నడిపినట్టుగా ఆయన ప్రగల్భాలు పలుకుతున్నాడు

- పేదల కడుపు నింపాలనుకుంటే.. 2014లో ఎందుకు అన్నా క్యాంటీన్ రాలేదు. అక్కడక్కడా, మొక్కుబడిగా పెట్టేసి, అందులోనూ వీళ్ళు కమీషన్లు మెక్కేసి, అదేదో గొప్పగా చెబుతున్నారు.  నాలుగు కోట్ల మందికి భోజనం పెట్టేశామని లోకేష్ మొన్నామధ్య చెప్పాడు. అంతకన్నా అబద్ధం ఉంటుందా.. ?

- జగన్ మోహన్  రెడ్డిగారి సంక్షేమ పథకాలను చూసి టీడీపీ వాళ్ళు బరితెగించి వ్యవహరిస్తున్నారు. 

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం
        ఉద్యోగాలు ఏవీ అని మాట్లాడుతున్న ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్నాం.  మీకు చెవులు పనిచేయవా.. కళ్ళు కనిపించవా.. అధికారంలోకి వచ్చిన  ఏడాదిలోనే 1.30 లక్షల శాశ్వత, సచివాలయాల ఉద్యోగులను నియమించింది వాస్తవం కాదా.. ?

- కుప్పంలో మా పార్టీ వాళ్ళు ఎవరూ ఉండకూడదా.. మేం ఇళ్ళల్లో తలుపులు వేసుకోవాలా..? అన్నట్టుగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. 

- కుప్పం ప్రజలు చంద్రబాబును రిజెక్ట్ చేశారు. టీడీపీ జెండాను ప్రజలు పీకేస్తే.. తిరిగి పాతాలని చూస్తున్నాడు. 

- ఎమ్మెల్యేగా కూడా కుప్పం ప్రజల మన్ననలు పొందడంలో విఫలమయ్యాడని గత ఏడాదిలోనే తెలిసిన తర్వాత.. చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నాడు. 

- చంద్రబాబుకు ఎదురుపోవద్దు.. అని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే.. పిచ్చోడికి ఎదురుపోతే ఏమవుతుందో.. చంద్రబాబు కూడా అటువంటి రాజకీయం చేస్తున్నాడు. 

- చంద్రబాబు డ్రామాలు హింసాత్మకంగా మారుతున్నాయి. వాటిని భరించే శక్తి ప్రజలకు లేదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.

 - వీడియోల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తున్న విజువల్స్ చంద్రబాబు మాదిరిగా మ్యానుఫాక్చరింగ్ కాదు..  టీడీపీ కార్యకర్తలు దుడ్డు కర్రలతో వెళుతున్న ఊరేగింపును పోలీసులు ఎలా అనుమతించారు.  మా జెండాను కిందేసి తొక్కుతుంటే.. పక్కనే ఉన్న పోలీసులు చూస్తూ ఉన్నారు. 
- అదొక రాజకీయ పార్టీ ప్రదర్శనలా ఉందా.. రౌడీల మంద ప్రదర్శనలా ఉంది. వాటి మీద సహజంగానే కేసులు పెడతారు. 
- మా వాళ్ళు దౌర్జన్యం చేసినట్టు... వాళ్ళ దగ్గర ఏమైనా  ఉంటే.. రుజువులు చూపండి. మొదట ఎవరు జెండాలు పీకారు. వైఎస్ఆర్సీపీ జెండాలు ఎవరు పీకారు ..? టీడీపీ వాళ్ళే అన్నది స్పష్టంగా తెలుస్తుంది. 
- చంద్రబాబు... ఎస్పీ ఇంటి మీదకు వస్తానంటాడు.. రెండు నిమిషాల్లో తేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు..  జగన్ మోహన్ రెడ్డిగారి నుంచి ఎప్పుడన్నా ఇటువంటి పదాలు విన్నారా.. ఇలాంటి ఆలోచనలు కూడా ఆయనకు రావు..
- ప్రజల్లోకి రాలేడు, గెలవలేడు కాబట్టి.. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ను ఇలా చూపిస్తున్నాడు. 
- చిన్న వయసు నుంచే చంద్రబాబు కుట్రల సిద్ధాంతం ఎలా ఉంటుందో.. దగ్గుబాటి రాసిన పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. 
- ఉద్యమం జరిగితే.. నాలుగు బస్సులన్నా తగలబడకపోతే ఎలా అని చంద్రబాబు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో.. అదే స్క్రీన్ ప్లేను చంద్రబాబు రాజకీయాల్లో అమలు చేస్తున్నారు.

Back to Top