వైయస్ఆర్ కడప: బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి ఒక్క టీఎంసీ తగ్గినా ఊరుకునేది లేదని, దానికి సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైయస్ఆర్ కడప జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్ఆర్ కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని విభజన చట్టం 11వ షెడ్యూల్ చెప్పిందని వివరించారు. కేడబ్ల్యూడీటీ-2కు కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు చట్టవిరుద్ధమని గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత అన్నివిధాలుగా నష్టపోతున్నాడని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్న కనీస జ్ఞానం చంద్రబాబు లేకుండాపోయిందని రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - వ్యవసాయరంగాన్ని గాలికొదిలేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఒకవైపు తీవ్ర అననుకూల పరిస్ధితుల్లో రైతులు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిందిపోయి, వ్యవసాయరంగం పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే పండగా నిలవకుండా వ్యతిరేక విధానాలనే అవలంభిస్తున్నాడు. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా గత మూడు పర్యాయాల మాదిరిగానే వ్యవసాయంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్న కనీస స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం రైతులు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలేమో. వ్యవసాయం గిట్టుబాటుకాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదు. మొంథా తుపాన్తో రైతులు నష్టపోతే పరిహారం ఎగ్గొట్టేందుకు పంట నష్టం అంచనాలు తక్కువ చేసి చూపించిన నాయకుడు దేశ చరిత్రలో చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. అన్నదాత సుఖీభవ పేరుతో పచ్చి మోసం వైయస్ఆర్సీపీ హయాంలో ప్రతిపంటకూ మద్ధతు ధర చెల్లించి రైతులను ఆదుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం రివ్యూలు కూడా చేయడం లేదు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఆదుకుంది. రైతు భరోసా పథకం కింద ఐదేళ్లలో 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 67,500 చొప్పున రూ.34 వేల కోట్లు జమచేస్తే, కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా పేరు మార్చి వదిలేసింది. ఎన్నికల సంమంలో ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మించి తీరా గెలిచాక రెండేళ్లలో రూ.17 వేల కోట్లు బకాయి పెట్టింది. రెండేళ్లలో రెండు విడతల్లో రూ. 40 వేలకు గాను ఇచ్చింది కేవలం రూ. 10వేలు మాత్రమే. వైయస్ఆర్సీపీ హయాంలో 54 లక్షల మంది లబ్ధిదారులుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను 47 లక్షలకు కుదించారు. ఆ విధంగా 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ధరల స్థిరీకరణ ద్వారా ఐదేళ్లలో రైతులకు రూ. 7,802 కోట్లు లబ్ధి చేకూర్చిన ఘనత మాజీ సీఎం వైయస్ జగన్కే దక్కుతుంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టన్ను రూ.25 వేలు పలికిన అరటి పంట నేడు రూ. 500 కూడా పలికడం లేదంటే చంద్రబాబు పాలనలో రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారో చెప్పాల్సిన పనిలేదు. కూలి కూడా గిట్టుబాటు కానిపరిస్థితుల్లో పంటలను పశువులకు మేతగా వేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అరటి రైతులు నష్టపోతున్నారని తెలుగుదేశం పార్టీ కరపత్రం ఈనాడులోనే రాశారు. తేమ శాతం, రంగు మారిందంటూ సీసీఐ కేంద్రాలు పత్తి పంట కొనకుండా రైతులను వేధిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఇవన్నీ చూసి కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. కొబ్బరి, మిర్చి, పొగాకు, ఉల్లి, చీనీ, శెనగ, వేరుశెనగ, టమాట, కోకో, పెసర, మినుము, చెరకు.. ఏ పంట చూసినా రైతుకు నష్టమే. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోవాల్సిందిపోయి ఏఐ టెక్నాలజీ పేరుతో రైతులను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. రైతులతో మాకు సంబంధమే లేదన్నట్టు ఈ ప్రభుత్వ వ్యవహరిస్తోంది. చంద్రబాబు రైతు శ్రేయస్సు కాంక్షించేవాడైతే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో విఫలం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956 బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. ఇదే అంశాన్ని కేడబ్ల్యూడీటీ–-2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునళ్లు చేసిన నీటి కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొంది. అందుకే వాటిని సవాల్ చేస్తూ నాడు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే.. కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం విచారణ చేయాలని, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తుది వాదనలు వినిపించటానికి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతూనే ఉంది. చంద్రబాబు నిర్లక్ష్యంతోనే ఆల్మట్టి ఎత్తు పెంపు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్నఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యామ్లో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ రైతులతోపాటు విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత 2000లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుండడంతో కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. ఆ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టు.. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, చంద్రబాబు అవేవీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయి. అప్పుడు కేవలం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలు నికర జలాల్లో.. ఒక్క టీఎంసీ తగ్గినా దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాటల్లో చెప్పుకోవడం మాని నిజంగా కేంద్రం వద్ద తనకు పలుకుబడి ఉందని చేతల్లో నిరూపించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే రైతుల తరఫున వైయస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం.