విజయవాడ : తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం అపరాధమని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర అని టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. మీడియా బాధ్యతగా వ్యవహరించి, తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. తిరుమల లడ్డూలో 2019 నుండి 2024 వరకు నకిలీ నెయ్యి వాడారన్న వార్తలను సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు నాణ్యత లేని నెయ్యితో తయారయ్యాయన్న వార్తలు తప్పుడు ప్రచారమే తప్ప నిజం కావన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే... లడ్డూ విషయం పై జరుగుతున్న SIT విచారణకు పూర్తిగా సహకరించామని, విచారణకు ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. "శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని, కానీ మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు చంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు CBI పర్యవేక్షణలో SITను ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే కథను ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొదట వెజిటబుల్ ఫ్యాట్ కలిపారు అంటూ ఆరోపణలు చేశారని, తర్వాత జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణగా మార్చారని పేర్కొన్నారు. "ఎక్కడైనా ల్యాబ్ నివేదిక ఉందా? సిట్ అధికారికంగా ప్రకటించిందా? లీకుల పేరిట విషప్రచారం ఎందుకని ప్రశ్నించారు. ముందు అనుమానాస్పదంగా గుర్తించిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపించామని అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పుడు మళ్లీ నెయ్యి ఏ రకంగా తిరిగి వచ్చిందో చెప్పాలన్నారు. నెయ్యి ధరలపై ఆరోపణలు కూడా తప్పుడు ప్రచారం తాను చైర్మన్గా ఉన్న సమయంలో రూ.326 కిలో ధరకు కొనుగోలు చేసిన నెయ్యి నకిలీదని చెప్పడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. "2017–18లో రూ.276, రూ.279 ధరలకు కొనుగోలు చేసిన నెయ్యి కూడా అదే లాజిక్ ప్రకారం నకిలీ అవుతుందా? అప్పటి లడ్డూలు కూడా అపవిత్రమా?" అని ప్రశ్నించారు.