తాడేపల్లి: టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పార్లమెంట్కి రాజీనామా చేయించడంతో పాటు ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చేసుకుంటున్న ప్రచారంలో ఏ మాత్రం నిజమున్నా ఈ పాటికే చంద్రబాబు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వాడని అన్నారు. ప్రెస్మీట్లో సుధాకర్బాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ: టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ డ్రగ్స్ వాడినట్టు తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. దీంతో తెలుగు దోపిడీ పార్టీ, తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీగా రూపాంతరం చెందినట్టయింది. ఇన్నాళ్లూ టీడీపీ కిందిస్ధాయి నాయకులు, కార్యకర్తలు డ్రగ్స్, గంజాయి వాడుతూ, దందా నడుపుతూ పలు సందర్భాల్లో దొరికినా చంద్రబాబు సహా ఆ పార్టీ నాయకులు ఏ తప్పూ చేయనట్టుగా బుకాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ ఎంపీనే డ్రగ్స్ వాడి, తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంత జరిగినా, టీడీపీ అధిష్టానం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించడం హేయం. కేసుని నీరు గార్చొదు: డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కి ఎంపీగా కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండటానికి ఆయన అనర్హుడు. ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబుకి ఏమాత్రం నైతిక విలువలున్నా మహేష్ యాదవ్ను తక్షణం తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రాష్ట్ర యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని లేకుండా చేయాలంటే నిందితులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే యువత ఇలాంటి వారిని చూసి పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. అసలే వేళాపాలా లేకుండా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిస్తూ యువతను సర్వనాశనం చేసిన చంద్రబాబు, ఇప్పుడు డ్రగ్స్ నిందితులను కూడా కాపాడితే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని టీజేఆర్ సుధాకర్బాబు తేల్చి చెప్పారు.