తాడేపల్లి: డ్రగ్స్ వాడినట్టు అన్ని టెస్టుల్లోనూ పోలీసులకు దొరికిపోయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో తక్షణం లోక్సభకు రాజీనామా చేయించాలని బాపట్ల జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాజిటివ్గా నిర్ధారణ అయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా షోకాజ్ నోటీసుల పేరుతో చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించడానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో సీఎం చంద్రబాబు హాట్లైన్లో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. వైయస్ఆర్సీపీ నాయకులు కోడిని కోసుకుని విందులు చేసుకున్నందుకే అరెస్టులు చేసి నడి వీధుల్లో నడిపించిన చంద్రబాబుకి, డ్రగ్స్ వాడటం తప్పుగా కనిపించలేదా అని నిలదీశాý‡ు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దేశంలో డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యానికి రాష్ట్రాన్ని కేరాఫ్గా మార్చాడని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుర్తు చేశారు. ప్రెస్మీట్లో మేరుగు నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..: అదీ గత ప్రభుత్వ చరిత్ర: గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం సెబ్ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) ఆధ్వర్యంలో పోలీసులు విశేషంగా కృషి చేశారు. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చు చేసిన చరిత్ర వైయస్ జగన్ ప్రభుత్వానిది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు నాడు జగన్గారు అంత చిత్తశుద్ధితో పని చేశారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికితే షోకాజ్ నోటీసులా?: అదే ఇప్పుడు చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలవుతున్నాయి. టీడీపీ ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చంద్రబాబు షోకాజ్ నోటీసులు ఇచ్చి వదిలేయడం సిగ్గుచేటు. ఎంపీగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి నిర్లజ్జగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని చంద్రబాబు కాపాడాలని చూస్తున్నాడు. రేవంత్రెడ్డితో హాట్లైన్లో తెరచాటు సంబంధాలు నెరుపుతూ కేసు నుంచి తప్పించడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. తమ పార్టీ ఎంపీ చేసిన తప్పును మసిపూసి మారేడుగాయ చేయాలని చూస్తున్నాడు. జగన్గారి పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసినా కేసులు పెట్టి నడి వీధిలో నడిపించిన పోలీసులు, వారిని వెనకుండి నడిపించిన చంద్రబాబు.. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన టీడీపీ ఎంపీని కాపాడాలన్న ప్రయత్నం ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిందితుడిని తప్పించే కుట్ర: డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్గా తేలిన పుట్టా మహేష్ యాదవ్ని రక్షించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం హేయం. ఫామ్ హౌస్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్న మాట వాస్తవమా? కాదా? యూరిన్ టెస్టులో నీళ్లు కలిపి మోసం చేసింది నిజమా? కాదా? రక్త పరీక్షలో కొకైన్ సేవించినట్టు తేలిన విషయం నిజమా? కాదా? ఆయన తప్పు చేసినట్టు కళ్ల ముందు అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం చంద్రబాబు అనైతికతకు నిదర్శనం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉపేక్షించి వదిలేస్తుండటంతో మహిళలు క్షణక్షణం భయపడుతూ బతుకుతున్నారు. కమిటీలు, విచారణ, షోకాజ్ నోటీసుల పేరుతో కాలయాపన చేయడం తప్పించి నిందితులైన ఏ ఒక్కరిపైనా ఇంతవరకు చర్య తీసుకున్న దాఖలాలు లేవు. తప్పు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నిందితుల్లో భయం కలిగించే పని ఒక్కటైనా చేశారా?. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి. తక్షణమే పుట్టా సుధాకర్యాదవ్తో ఎంపీ పదవికి రాజీనామా చేయించడంతో పాటు, ఆయన్ను పార్టీ నుంచి కూడా తొలగించాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.