తాడేపల్లి: రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కు ఎఫ్సీఆర్ఏ (FCRA) అనుమతులు పునరుద్ధరించడంపై వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్షాలకు ఎక్స్ వేదికగా వైయస్ జగన్ గారు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక అభివృద్ధి రంగాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ చేస్తున్న సేవలు పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణతో ఆ సేవలు కొనసాగి, మరింత మంది లబ్ధిదారులకు మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశంలో చంద్రబాబు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించడం ఆశ్చర్యకరమని వైయస్ జగన్ విమర్శించారు. నిజంగా కృషి చేసి ఉంటే 2025 ఏప్రిల్ 21న నిలిచిపోయిన అనుమతులు పునరుద్ధరించడానికి ఏడాది కాలం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే వైయస్ఆర్సీపీతో పాటు ప్రజా సంఘాలు ఉద్యమం చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పబ్లిసిటీ కోసం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని, అలాంటి చర్యలు ప్రజలను తప్పుదారి పట్టించేవని పేర్కొన్నారు.