అనంతపురం: వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందనివ్వకూడదని ముఖ్యమంత్రి స్థానంలో వున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలుగుదేశం పార్టీ వారికే ముఖ్యమంత్రిగా ఉన్నారా అని ప్రశ్నించారు. సీఎంగా పదవీ స్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రజలను సమ దృష్టితో చూస్తానంటూ, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తన ప్రత్యర్థి పార్టీ వారికి సంక్షేమాన్ని అందించకూడదంటూ ఆయన చేసిన ప్రకటనతో ముఖ్యమంత్రి స్థానాన్నే దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... వైయస్ఆర్సీపీ వారికి పనులు చేయనని, చేయొద్దని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చెప్పడం రాష్ట్రంలోని ఒక వర్గంపై వివక్ష చూపడమే అవుతుంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలలి. రాజ్యాంగంలో ఎలాంటి వివక్షకూ తావులేదని, రాష్ట్ర ప్రజలందర్నీ సమదృష్టితో చూస్తానని సమన్యాయం చేస్తానని, పక్షపాతం చూపనని చేసిన ప్రమాణాన్ని చంద్రబాబు ఉల్లంఘించారు. 9 నెలల పాలనతోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చంద్రబాబు, తన చేతకానితనాన్ని గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై నెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజా పాలన అందించాలనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, గత వైయస్ జగన్ పాలన నుంచి స్ఫూర్తి పొందాలి. వివక్షత లేకుండా పాలన అందించిన ఘనత వైయస్ జగన్ది గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు కులం, మతం, ప్రాంతం చూడకుండా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించారు. చంద్రబాబు మాత్రం వైయస్ఆర్సీపీ వారికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగాకానీ పనిచేయనని చెప్పడం చూస్తుంటే ఈ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా పాలిస్తున్నాడో అర్థమవుతోంది. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు మరింత దిగజారిపోయి పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారని బహిరంగంగా చెప్పడం ఇంకా సిగ్గుచేటు. 1995 కాలం నాటి ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పడం చూస్తుంటే మామ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో సీఎం అయిన ఉదంతం ప్రజలకు గుర్తు చేస్తున్నారా? పేరుకే చంద్రబాబు విజనరీ. 9 నెలల పాలనతోనే చంద్రబాబు విఫల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే ఉండటం లేదు. 12 శాతం వృద్ధి రేటు నమోదు చేశానంటాడు.. కానీ వారం వారం అప్పులు తెస్తాడు. చంద్రబాబు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎంతసేపటికీ గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెపం నెట్టాలని చూస్తాడు తప్పితే, ఎన్నికల హామీల అమలుపై చిత్తశుద్దితో ప్రయత్నించడం లేదు. చంద్రబాబు ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడమే. క్లిష్ట పరిస్థితుల్లో పరిపాలన ఎలా చేయాలో తెలియకపోతే గత వైయస్ జగన్ పాలన నుంచి స్ఫూర్తి పొందాలి. ఎన్నికల హామీల అమలులో వారు చూపిన చిత్తశుద్ధి నుంచి ప్రేరణ పొందాలి.