విశాఖపట్నం: సీఎం చంద్రబాబునాయుడు తిరుమల పర్యటన సందర్భంగా కళంకితుడైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరగడం ద్వారా ఆయన మరోసారి శ్రీ వెంకటేశ్వరస్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని వైయస్ఆర్సీపీమహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడిపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదే పదవిలో కొనసాగించడం వెనుక ఉన్న హిందూ ద్రోహి ఎవరో ప్రజలకు అర్థమైందని ఆమె పేర్కొన్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వరుదు కళ్యాణి ఆక్షేపించారు. ప్రెస్మీట్లో వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..: కుటుంబ కార్యక్రమంలో కళంకితుడైన వ్యక్తి ఎందుకు?: తిరుమలలో తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చంద్రబాబు వెళ్లడం సాధారణ విషయమే అయినా, కళంకితుడైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఇలా వివాదాస్పద వ్యక్తికి మద్దతుగా నిలబడటం బాధాకరం. బీఆర్ నాయుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?: బీఆర్ నాయుడి మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తారని ఎన్నికల సమయంలో ఇందులేఖ అనే మహిళ చంద్రబాబుకు స్వయంగా లేఖ రాసి ఫిర్యాదు చేసింది. ఇలాంటి వ్యక్తికి మీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత టీటీడీ చైర్మన్ వంటి పదవి ఇవ్వవద్దని ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయినా చంద్రబాబు బీఆర్ నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయనను టీటీడీ చైర్మన్గా నియమించడం దురదృష్టకరం. ఇటీవల బీఆర్ నాయుడుకు సంబంధించిన అశ్లీల వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించకపోవడం అత్యంత హేయం. ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతున్న బీఆర్ నాయుడు: బీఆర్ నాయుడు ఈ స్థాయిలో అహంకారంగా మాట్లాడటానికి ఆయనకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ప్రజలకు అర్ధమవుతోంది. అశ్లీల వీడియోలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తులు బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, చంద్రబాబు స్వార్థ రాజకీయం. బీఆర్ నాయుడి ద్వారా శ్రీవారి సొమ్ము దోపిడి: నారా చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్గా నియమించిన తర్వాత, ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీ నిధులను దుర్వినియోగం చేసే అవకాశం కల్పించారు. నెయ్యి టెండర్ ధరను రూ.658 వరకు పెంచడం ద్వారా శ్రీవారి సొమ్మును దోపిడీ చేయవచ్చు. ఇందులో బీఆర్ నాయుడు సహకారం ఉంటుందని ఆయన్ను చంద్రబాబు టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారు . బీఆర్ నాయుడిని ఇంకా ఎలా కొనసాగిస్తారు?: టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు భగవద్గీతపై అహంకారంగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఎలా కొనసాగిస్తారని నేను నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నాను. ఆయన చైర్మన్గా ఉన్న తర్వాత భక్తుల మనోభావాలు దిగజారిపోయాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తిరుమలలో అనుచిత ఘటనలు పెరిగాయి. సాధారణ భక్తులు ఇబ్బందులు పడుతుండగా కొందరికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని కొనసాగించడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి. భువనేశ్వరికి ఆ బాధ్యత లేదా?: బీఆర్ నాయుడిని ఎలా కొనసాగిస్తారని నారా భువనేశ్వరి తన భర్త నారా చంద్రబాబు నాయుడును అడగాల్సిన బాధ్యత లేదా? తిరుమలలో జరిగిన అన్నప్రసాదం కార్యక్రమంలో కూడా బీఆర్ నాయుడు చంద్రబాబు కుటుంబం వెనుక తిరగడం బాధాకరం. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఎలా నియమించారు? అశ్లీల వీడియోలతో బయటపడిన తర్వాత కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒక మహిళగా భువనేశ్వరి దీనిపై ప్రశ్నించాలి. చంద్రబాబు తప్పుడు సందేశం: బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని చంద్రబాబు తన కుటుంబ కార్యక్రమాల్లో కూడా వెంట తిప్పుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్నారు. పార్టీ నాయకులు ఎలాంటి తప్పులు చేసినా అండగా ఉంటానని సంకేతాలు ఇస్తున్నట్లే ఉంది. టీటీడీ వంటి పవిత్ర సంస్థ చైర్మన్పై ఇన్ని ఆరోపణలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదు. బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలి: శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇలవేల్పు అని చంద్రబాబు చెబుతారు. అయితే అలాంటి పవిత్రమైన దేవాలయానికి బీఆర్ నాయుడులాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా ఎందుకు నియమించారు? ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత తిరుమల కొండపై ఎన్నో దారుణాలు జరుగుతున్నా ఎందుకు కొనసాగిస్తున్నారు? అతన్ని తొలగించాల్సిన బాధ్యత చంద్రబాబుపై లేదా? ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామిపై నిజంగా భక్తి ఉంటే, వెంటనే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. జగన్గారి హయాంలో హిందూ ధర్మ పరిరక్షణ: టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ను చంద్రబాబు నిన్న (శనివారం) ప్రారంభించారు. కానీ ఆ ల్యాబ్ను 2023లోనే జగన్గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. అయినా చంద్రబాబుగారు నిస్సిగ్గుగా ఆ ల్యాబ్ ప్రారంభించి, మరోసారి క్రెడిట్చోరీకి పాల్పడ్డారు. రాష్ట్రంలో నిజానికి జగన్గారి హయాంలోనే హిందూ ధర్మ పరిరక్షణకు కృషి జరిగింది. విజయవాడలో చంద్రబాబు హయాంలో కూల్చిన 40 దేవాలయాలను జగన్గారు తిరిగి నిర్మించారు. శ్రీవాణి ట్రస్ట్ వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు అయింది. ఇప్పుడు 5 వేల ఆలయాలు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడం జగన్గారి కార్యక్రమాలు కాపీ కొట్టడమే అని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు.