నేనున్నాను..అధైర్య‌ప‌డొద్దు

నియోజ‌కవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

పులివెందుల క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జాద‌ర్భార్‌

వైయ‌స్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌...పులివెందుల పర్యటనలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు విని, వారికి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్యపడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.  

వైయస్‌ జగన్‌ నివాసంలో వేదపండితులు ఆశీర్వచనాలు.

పులివెందులలోని ఆయన నివాసంలో, కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్‌ జగన్‌ కు అందజేశారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పండితులు ఆయనకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు.

అలాగే, ఆలయాల పవిత్రత, ఆగమ శాస్త్రాల పరిరక్షణ, సంప్రదాయాల ప్రాముఖ్యతపై వైయస్‌ జగన్‌ వేదపండితులతో చర్చించారు. దేవాలయాలలో నిత్య పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం ఎంతో అవసరమని, తద్వారా ఆధ్యాత్మిక విలువలు తరతరాలకు సంక్రమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధి, వేద విద్య ప్రోత్సాహానికి గతంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైయస్‌ జగన్‌ తెలిపారు. అనంతరం వైయస్‌ జగన్‌ వేదపండితులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారి ఆశీర్వాదాలను వినమ్రంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా పులివెందులలోని వైయస్‌ జగన్‌ నివాసం... కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు  శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

Back to Top