రాజమండ్రి: వికేంద్రీకరణకు మద్దతుగా, అమరావతి యాత్రకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాజమండ్రివాసులుపై దాడికి తెగబడిన అమరావతి పాదయాత్రికులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దారుణంగా వ్యవహరించారని, రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారని, వాటర్ బాటిళ్లలో మురికినీరు నింపుకొని వచ్చి మరీ తమపై విసురుతున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడు బేషరతుగా రాజమండ్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేనకు ప్రజలు బుద్ధిచెప్పాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రీప్లాన్డ్గా రాళ్లు, వాటర్ బాటిళ్లు తెచ్చుకొని తమపై, పోలీసులపై విసురుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అమరావతి పాదయాత్రలో బ్లేడ్ బ్యాచ్ చేరిందని, పాదయాత్ర పేరుతో తిరుగుతున్నవారి కొందరి జేబుల్లో బ్లేడ్లు, కత్తులు కూడా ఉంటాయన్నారు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీరంతా నిజమైన రైతులా..? రైతుల ముసుగులో రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్ చేరారని ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు.