కరోనా నియంత్రణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం

సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతో అనేక చర్యలు చేపట్టాం

వలంటీర్‌ వ్యవస్థతో వేల ప్రాణాలను కాపాడుకున్నాం

పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు అద్భుతం

పేద, మధ్య తరగతి ప్రజలకు నెలకు మూడుసార్లు రేషన్‌

ఇంటింటికీ మూడు మాస్కులు పంపించాం

అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

అసెంబ్లీ: కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని, ఏపీని చూసి ప్రపంచం నేర్చుకోవాలని యూకే డిప్యూటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్లెమింగ్‌ ప్రశంసించారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య వ్యవస్థను చాలా నిర్లక్ష్యం చేసిందని, ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు, పరికరాలు లేవు, మెడిసిన్‌ లేవు, 104, 108 వాహనాలు లేవు.. అలాంటి పరిస్థితి నుంచి రోజుకు 80 వేల టెస్టులు చేసే స్థాయికి తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. కరోనా నియంత్రణ చర్యలు ఒకపక్క చేపడుతూనే.. 1088 నూతన 104, 108 వాహనాలను ప్రారంభించారన్నారు. కరోనా సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారన్నారు. 

అసెంబ్లీలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కోవిడ్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌. మన రాష్ట్రంలో ఈ మూడు అంశాలపై అద్భుతంగా పనిచేశారు. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు మార్చి 10వ తేదీన నెల్లూరులో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వచ్చింది. ఒక్క రోజులోనే 20 వేల కుటుంబాలను 40 మంది టీమ్‌తో సర్వే చేశారు. ప్రపంచంలోనూ ఎక్కడా లేని వలంటీర్ల వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. కరోనా సమయంలో వలంటీర్ల ఉపయోగం తెలిసింది. అదేవిధంగా కేసు వస్తే ప్రైమరీ కాంటాక్టు ఎంక్వైరీ చేయడం, సెకండరీ కాంటాక్టు గుర్తించడం, ఏఎన్‌ఎంలు, డాక్టర్లు, పోలీసులు ఒక టీమ్‌గా అద్బుతంగా పనిచేశారు. 

వలంటీర్లు అంటే మూటలు మోసేవాళ్లు, ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో తలుపులు కొట్టేందుకు వస్తున్నారని చంద్రబాబు ఎగతాళి చేశాడు. ఇదే వలంటీర్‌ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో వేల ప్రాణాలను కాపాడగలిగాం. 

రెడ్‌జోన్‌లోని కుటుంబాలకు నిత్యవసర సరుకులు, మెడిసిన్‌ ఇవ్వడానికి వలంటీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారు. టెస్టింగ్‌ గురించి మాట్లాడితే.. మొట్టమొదటి కేసు నమోదైనప్పుడు శాంపిల్‌ హైదరాబాద్‌కు పంపించాల్సిన పరిస్థితి. మార్చి మొదటి వారంలో స్విమ్స్‌లో మొట్టమొదటి టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించుకున్నాం. అప్పటి నుంచి నేటి అక్టోబర్‌ వరకు దాదాపు 150 టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామంటే అది సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన దక్షత. 

ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు వచ్చే సరికి రోజుల సమయం పడుతుందని 295 ట్రూనాట్‌ మెషిన్లను తీసుకువచ్చారు. దేశం మొత్తం చూస్తే.. 40 శాతం మెషిన్లు ఏపీలోనే ఉన్నాయి. కోటి పరీక్షలు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీ. 10 లక్షల మందిలో 2 లక్షల మందికి టెస్టులు చేశాం. రోజుకు 70 నుంచి 80 వేల టెస్టులు చేశాం. అక్టోబర్‌ 31న 88,780 టెస్టులు చేశారు. ఉచితంగా టెస్టులు చేసి ఆరోగ్యశ్రీ కింద కరోనా వైద్యం అందించాం. 
122 వీరా బస్సులు, 52 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి టెస్టులు నిర్వహించారు. 

చిన్న, మధ్య తరగతి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. ఆ సమయంలో నెలకు మూడుసార్లు రేషన్‌తో పాటు కుటుంబానికి రూ.1000 ఆర్థికసాయం అందించారు. ప్రతి కుటుంబానికి సాయం చేసేందుకు రూ.1300 కోట్లు ఖర్చు చేశారు. 

ఒక్క నెలలోనే గ్రహించి కరోనాతో సహజీవనం చేయాలని ముందుగానే చెప్పారు. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ కూడా మూడు నెలల తరువాత కరోనాతో సహజీవనం అని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎంత ముందుచూపుతో లోచన చేస్తున్నారనే దానికి వలంటీర్ల వ్యవస్థ, కరోనాతో సహజీవనం స్టేట్‌మెంట్‌ నిదర్శనం. 
ఈ క్రమంలోనే మూడు రాజధానుల అంశం కూడా ముందు చూపుతోనే తీసుకువచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. 

కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే 1088 నూతన 108, 104 నూతన వాహనాలను తీసుకువచ్చారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లో కోవిడ్‌ టెస్ట్‌కు రూ.1500 చార్జ్‌ చేస్తుంటే రూ.650కే చేయాలని ఆర్డర్‌ ఇచ్చారు. 104 కాల్‌సెంటర్‌ 20 మంది, 60 మంది కాల్‌సెంటర్‌ ఎగ్జిక్యూటీవ్స్‌ మెరుగైన సేవలు అందించారు. కరోనా మరణాల రేట్‌ దేశంలో 1.46 శాతం అయితే ఏపీ 0.8 శాతంలో ఉంది. కరోనా టెస్టు ఫర్‌ మిలియన్‌ 1.90 లక్షలు ఏపీలో జరిగితే దేశంలో సగటున 1.10 లక్షలు. 

కరోనా నియంత్రణ చర్యలపై ఇండియా టుడే సర్వే చేసింది. ఈ సర్వేలో మన రాష్ట్రానికి 3వ స్థానం వచ్చింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్‌ వరకు ట్రీట్‌మెంట్‌లో భోజనం కూడా అద్భుతంగా పెట్టారు. ఆస్పత్రుల బెడ్లు పెంచడం, 21,662 మంది స్టాఫ్‌ను రిక్రూట్‌ చేసుకున్నాం. ఇంత బ్రహ్మాండంగా పనిచేసినా ఎక్కడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. 

ఇదే చంద్రబాబు హయాంలో జరిగే.. కరోనాతో కత్తియుద్ధం అని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసుకునేవాడు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఎక్కడా పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. మాస్కే కవచం పేరుతో ప్రభుత్వం విస్తృత ప్రచారం చేపించింది. ఇంటింటికి 3 మాస్కులు పంపిణీ చేపట్టారు’ అని వివరించారు. 
 

Back to Top