విశాఖపట్నం: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం చివరికి విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడటం లేదని, వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టి వేధించడమే దానికి ఉదాహరణ అని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వైయస్ఆర్సీపీఅధ్యక్షులు కెకె రాజు, గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడన్న కోపంతోనే కుట్రపన్ని కొండారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వివరించారు. పోలీసులు ఎఫ్ఐఆర్లోనమోదు చేసిన వివరాలన్నీ తప్పని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంటూ సీసీ టీవీ ఫుటేజీలను ప్రదర్శించారు. కొండారెడ్డికి డ్రగ్స్ అలవాటు లేకపోయినా అతడ్ని పోలీసులు తీవ్రంగా కొట్టి సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని అతడు జడ్జి ముందు చెప్పి, తాను ఎలాంటి టెస్ట్కైనా సిద్ధమని ప్రకటించిన విషయాన్ని పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ కేసులో కొండారెడ్డితోపాటు మరో ఇద్దర్నీ అరెస్టు చేశామని చెబుతున్న పోలీసులు, వారు ఏ కాలేజీలో చదువుతున్నదీ చెప్పలేదన్నారు. కానీ కొండారెడ్డి మాత్రం ఏయూలో చదువుతున్నాడంటూ మీడియాలో వార్తలు రాయించి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని కెకె రాజు, గుడివాడ్ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండారెడ్డితోపాటు అరెస్ట్ అయిన విద్యార్థులు దాడి ఇంజినీరింగ్ కాలేజీ, గీతం యూనివర్సిటీల్లో చదువుతుంటే వాటి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొండారెడ్డి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉండి న్యాయపోరాటం చేస్తుందని వారు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● ప్రభుత్వమే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినా, పాలనను ప్రశ్నిస్తున్నా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేసినా ప్రభుత్వ పెద్దలు ఓర్వలేకపోతున్నారు. ఇన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెట్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి వారి జీవితాలను ఆగం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు సహా ఎన్నో ఘోరాలు నిత్యకృత్యమైపోయాయి. దీనిపై హోంమంత్రిని ప్రశ్నిస్తుంటే నా చేతిలో లాఠీ లేదు,చేతిలో గన్ లేదు అని చేతులెత్తేయడం తప్ప బాధితులకు న్యాయం చేసే విషయం మీద ఫోకస్ పెట్టడం లేదు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో హోంమంత్రి అనిత దిగజారిపోయి ఒక విద్యార్థి మీద నిందలు, ఆరోపణలు చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేయడమే పనిగాపెట్టుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులంతా టీడీపీ నాయకులేనని ఆధారాలు స్పష్టం చేస్తున్నా, వారిని వెనకేసుకొస్తూ ఈ కేసులో తన పాత్ర లేకపోయినా మాజీ మంత్రి జోగి రమేశ్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన కుటుంబాన్ని వేధిస్తున్నారు. మొంథా తుపాన్ సహాయ చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం, కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జోగి రమేశ్ ని అక్రమంగా అరెస్ట్ చేసి వైయస్ఆర్సీపీ మీద బురదజల్లాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. ● కొండారెడ్డి అక్రమ అరెస్ట్ విశాఖపట్నం సిటీ వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి చెందిన కొండారెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును చూసి అదంతా నిజమేనేమో అని అనుకున్నాం. అయితే కొండారెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి సేకరించిన ఆధారాలతో ఇదంతా రాజకీయ కోణంలో తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నట్టుగా అర్థమైపోయింది. కొండారెడ్డి సైతం తాను ఏ తప్పూ చేయలేదని, తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఏ టెస్ట్ కైనా సిద్ధమని చెబుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి కక్షసాధింపు చర్యలకు దిగుతుందో చెప్పడానికి కొండారెడ్డి కేసు తాజా ఉదాహరణ. అందుకే ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. కొండారెడ్డితోపాటు మరో ఇద్దరు స్నేహితులు గీత్ చరణ్, హర్ష వర్దన్ నాయుడును నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.45కి విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలో టాస్క్ఫోర్స్ పోలీసులు, నాలుగో టౌన్ పోలీసులు కలిసి పట్టుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ సీసీ టీవీ ఫుటేజీ చూస్తే ఉదయం 7.10 గంటలకు జయభేరి ఆటోమెటివ్ వద్ద కొండారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది. (వీడియో ప్రదర్శించారు). ఇప్పుడు మేం చూపిస్తున్న ఈ వీడియో విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్స్టేషన్ సమీపంలోని కొండారెడ్డి ఇంటికి పావు కిలోమీరు దూరంలో ఉన్న ప్రాంతం. తెలుపు రంగు ఓలా బైకు మీద ఉన్న కొండారెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకుని, కొట్టి అదుపులోకి వీడియో సాక్షిగా కనిపిస్తోంది. మొత్తం 7 బైకులపై వచ్చి కొండారెడ్డిని చుట్టుముట్టి మరో బైకుపై మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోయారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ అరెస్ట్ వ్యవహారం మొత్తం నవంబర్ 2 తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 5.40 వరకు జరిగిందని తెలుస్తోంది. అలాంటప్పుడు అదే రోజు ఉదయం 11.45 గంటలకు కొండారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుగుదేశం పార్టీ అధికారికి ఎక్స్ ఖాతాలో ఎలా పోస్ట్ చేశారు? కొండారెడ్డిపైన ఆరోపణలు చేస్తూ, ఫొటోలన్నీ కూడా పోస్ట్ చేశారు. సాయంత్రం అరెస్ట్ చేయబోతున్నట్టు ముందే తెలుగుదేశం సోషల్ మీడియాకి ఎలా తెలుసు? చంద్రబాబు దగ్గర ఏమైనా టైమ్ మెషీన్ ఉందా? బ్రహ్మంగారిలాగా ఆయనకేమైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలజ్ఞానం తెలుసా? దీనర్థం, ఇది ముందస్తుగా చేసిన కుట్ర. పోలీసులను వాడుకుని రాజకీయ కుట్ర పాల్పడ్డారు. వైయస్ఆర్సీపీ మీద బురదజల్లడానికి పథకం వేశారు. ఎఫ్ఐఆర్లో అంశాలు అబద్ధమని తేలిపోయాయి. దీనికి సీసీ ఫుటేజీ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. అంటే కొండారెడ్డి నవంబర్ 2న న్యూకోలనీ ప్రాంతానికి వెళ్లలేదన్నది నిజం? ● న్యూకాలనీలో అరెస్ట్ చేసినట్టు ఫేక్ ఆధారం సృష్టి మద్దిలపాలెంలో కొండారెడ్డిని పట్టుకున్నప్పుడు, కేసు సంబంధిత ఎంవీపీ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాలి? అలాకాకుండా నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో ఏ రకంగా నమోదు చేస్తారు? దీని వెనుక కూడా ఒక కల్పిత కథ ఉంది. మద్దిలపాలెంలో కొండారెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నప్పుడు, ఆ స్కూటర్ని నేరుగా టాస్క్ఫోర్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. పట్టుకున్న ప్రాంతం నుంచి టాస్క్ఫోర్స్ పోలీస్ స్టేషన్ 3.1 కి.మీ దూరంలో ఉంది. ఇది స్కూటర్లో రికార్డై ఉంది. అంటే వాస్తవానికి ఎంవీపీ పోలీస్స్టేషన్లో ఉంచాల్సిన స్కూటర్ను తాము ముందుగా రాసుకున్న కథ కోసం అక్కడకు తీసుకెళ్లారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే.. పోలీసుల అదుపులో ఉదయం 7:10 గంటలకే కొండారెడ్డి అరెస్టయితే, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ స్కూటర్ మాత్రం కొండారెడ్డి అరెస్టయిన తర్వాత కూడా మధ్యాహ్నం 3:59 గంటలకు 14.3 కి.మీ ప్రయాణం చేసింది. ఇదెలా సాధ్యం? ఇలా పోలీసులు ఎందుకు చేశారంటే, తాము రాసుకున్న ప్లాన్ ప్రకారం, న్యూకోలనీ ప్రాంతంలో వాళ్లు సంచరించినట్టుగా ఒక ఫేక్ ఆధారం ఉండాలి కాబట్టి. పోలీసులే ఉద్దేశ పూర్వకంగా ఆ స్కూటర్ను అన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేశారు? మరి దీన్ని తప్పుడు కేసు కాదంటారా? కొండారెడ్డిని మద్దిలపాలెం వద్ద అరెస్టుచేశారు. రూల్ ప్రకారం ఎంవీపీ పోలీస్స్టేషన్కు అప్పగించాలి. కానీ, రైల్వే న్యూకోలనీలో అరెస్టు చేశామని, పోలీసులు రాసుకున్న కల్పిత కథ ప్రకారం నాలుగో టౌన్ పోలీసులకు అప్పగించారు. ఎన్నికుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేశారని అర్థం అవుతోంది. ఇది పూర్తిగా తప్పుడు కేసు ఈ సాక్ష్యాధారాలను బట్టి రుజువు అవుతోంది. ● హోంమంత్రి సమాధానం చెప్పాలి తనకు ఎలాంటి పరీక్షలు చేసినా సిద్ధమేనని, పారదర్శకంగా విచారణ జరిగాలని ఇప్పుడు కొండారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని సవాల్ విసురుతున్నాడు. మరి వీళ్లకి ఆధైర్యం ఉందా? ఈ ఉదయం హోంమంత్రి అనిత ఒక ప్రెస్మీట్ పెట్టి, ఈ తప్పుడు కేసును అడ్డంగా పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడారు. ఈ తప్పుడు కేసు అని చెప్పడానికి ఇన్ని ఆధారాలు చూపించాను. తప్పుడు కేసు పెట్టి, రాజకీయ లబ్ధికోసం ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న మీరు క్షమించమని ఆ కుటుంబాన్ని అడుగుతారా? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? లేక లెంపలేసుకుంటారా? హోంమంత్రి సమాధానం చెప్పాలి. కేవలం చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన స్క్రిప్టులు పట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసి, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పరువును తీయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా బురద జల్లాలన్న తాపత్రయం తప్పించి పోలీసులు చెబుతున్న మాటలకు కనిపిస్తున్న ఆధారాలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో అల్లిన తప్పుడు కేసుగా అర్థమైపోతుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఓ ఘటనలో తెలుగుదేశం నాయకుడు మీద కేసు నమోదైతే సీపీ మీద తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒత్తిడి చేసి విడిచిపెట్టేదాకా వదల్లేదు. పేర్లన్నీ మాయం. ఇప్పాడు ఆ కేసు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. కానీ కొండారెడ్డి విషయంలో నిజం నిలకడగానే తెలుస్తుందనే ఉద్దేశంతో వైయస్ఆర్సీపీ ఎక్కడా కలగజేసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడిపోతున్న పరిస్థితి. తాము కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్లాలన్నా భయం. రామ్మోహన్నాయుడు విమానయాన శాఖకి మంత్రిగా చేస్తున్నంతకాలం ఫ్లైట్ ఎక్కాలన్నా భయమే. బస్సులో ఊరెళ్లాలంటే భయం. ఆఖరుకి బాధలు మర్చిపోయి ప్రశాంతంగా మద్యం తాగుదామంటే అది కూడా నకిలీ మద్యమే. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ విశాఖ బ్రాండ్ ఇమేజ్ను నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ● టీడీపీ సోషల్ మీడియా కోసం పోలీసులు పనిచేస్తున్నారా? - అనకాపల్లి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు కెకె రాజు. విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చూస్తే పోలీసులు విద్యార్థుల మీద కూడా అక్రమ కేసులు పెటి వారి జీవితాలను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పైగా కొండారెడ్డిని అరెస్ట్ చేయకుండానే తెలుగుదేశం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. తద్వారా వైయస్ఆర్సీపీ మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. చేతిలో పోలీస్ వ్యవస్థను పెట్టుకుని కుట్రలతో ప్రశ్నించే గొంతు నొక్కాలని భ్రమపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలను నిరసిస్తూ కొండారెడ్డి బలంగా పోరాడటంతో ప్రభుత్వం టార్గెట్ చేసి అక్రమ కేసు పెట్టింది. కొండారెడ్డితోపాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఓలా స్కూటర్ ఆయన తండ్రి సూర్యనారయణరెడ్డి పేరు మీద ఉంది. దానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉండటంతో అసలు వాస్తవాలన్నీ బయటకొచ్చాయి. పోలీసుల కుట్రలు బయటపడ్డాయి. టీడీపీ పోస్ట్ చేసిన వీడియోలతోనే అక్రమ అరెస్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరికాయి. అయినా డీసీపీ స్థాయి అధికారి ప్రెస్మీట్ పెట్టి తప్పుడు వివరాలు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోసం పోలీసులు పనిచేస్తున్నారా అనిపిస్తుంది. ● ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్ట దిగజార్చేలా తప్పుడు రాతలు ఈ కేసులో కొండారెడ్డితో పాటు మరో ఐదుగురి పాత్ర ఉందని సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాలో ప్రచారం జరిగింది. ఏ1 గా ఉన్న గీత్ చరణ్ అనే వ్యక్తి దాడి ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఏ2గా కొండారెడ్డి ఏయూలో చదువుతున్నాడు. ఏ3 గా ఉన్న హర్షవర్ధన్నాయుడు గీతం యూనివర్సిటీలో చదువుతున్నాడు. కూటమి నాయకులకు ఆంధ్రా యూనివర్సిటీ అంటే చులకన కాబట్టే ఆ పేరును మాత్రమే చెప్పి మిగతా కాలేజీల పేర్లు బయటకు చెప్పడం లేదు. గతంలోనూ ఆంధ్రా యూనివర్సిటీలో కొకైన్ దొరికిందంటూ మీడియాలో హడావుడి చేశారు. పదే పదే ఏయూ ప్రతిష్టను దిగజార్చేలా వార్తలు రాస్తున్నారు. జడ్జి మందలించిన తర్వాత రిమాండ్ రిపోర్టులను పోలీసులు మార్చేశారు. మొదటిరోజు ఏ2గా ఉన్న కొండారెడ్డిని రెండో రోజు రిమాండ్ రిపోర్టులో ఏ1గా చేర్చారు. ఎఫ్ఐఆర్ లో గీత్ చరణ్ ఇచ్చిన రిపోర్టును సీఐ ఇచ్చినట్టుగా రాశారు. తనను తీవ్రంగా కొట్టి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారే తప్ప తాను డ్రగ్స్ వాడలేదని కొండారెడ్డి చెబుతున్నాడు. తాను ఎలాంటి టెస్ట్కైనా సిద్ధంగా ఉన్నానని జడ్జి ఎదుట స్పష్టం చేశాడు. ఇదంతా వైయస్ఆర్సీపీ ప్రతిష్టను దిగజార్చాలని చేసిన కుట్ర తప్ప ఇంకోటి కాదు. కొండారెడ్డి అక్రమ అరెస్ట్పై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుంది. వారి కుటుంబానికి అండగా ఉంటాం.