లిక్కర్‌ కేసులో పూర్తిగా రాజకీయ దురుద్దేశం

జల్లా సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం

లిక్కర్‌ కేసును ప్రతీకార చర్యగా సుప్రీంకోర్టు అభివర్ణించింది

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి..

బెయిల్‌ పిటిషన్ల విచారణలో ఎపెక్స్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు 

మీడియాతో ప్రస్తావించిన జల్లా సుదర్శన్‌రెడ్డి

తాడేపల్లి:    నాడు సీఎం  వైయస్‌ జగన్‌ వద్ద కార్యదర్శిగా పని చేసినఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేసినప్పటికీ, వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర నాయకుడు జల్లా సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఇదే కేసును ఒకానొక దశలో రాజకీయ దురుద్దేశంతో నమోదు చేయబడిన కేసుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు.

మీడియాతో జల్లా సుదర్శన్‌రెడ్డి ఇంకా ఏం అన్నారంటే.:

సుప్రీంకోర్టు నోట ఆ మాట:
    రాజకీయ దురుద్దేశంతో ప్రతీకారం తీర్చుకోవడానికి నమోదు చేయబడిన కేసుగా ఇది కనబడుతోందని, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్‌గారి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ పురోగతిలో ఉందని, ఇంకా లోతైన విచారణ జరగాల్సిన అవసరముందని చెబుతూ..  కింది కోర్టులో బెయిల్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది.
    2014–19 మధ్య చంద్రబాబు తన పాలనలో చేసిన అనేక అక్రమాలపై ఆ తర్వాత నమోదైన.. స్కిల్‌ స్కామ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్, లిక్కర్‌ స్కామ్, ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాం, అక్రమ మైనింగ్‌ కేసుల్లో తన నిర్దోషిత్వం నిరూపించుకోలేక, కక్ష పూరితంగా ఇప్పుడు లిక్కర్‌ స్కామ్‌ అంటూ కేసు నమోదు చేసినట్లు కనపడుతోంది. అందుకే ఎపెక్స్‌ కోర్టు కూడా ఈ కేసును దురుద్దేశంతో ప్రతీకారం తీర్చుకోవడానికి నమోదు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది.

వాంగ్మూలాలు. కోర్టు వార్నింగ్‌:
    బెయిల్‌ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా నిర్దేశించింది. విచారణ సందర్భంగా నిందితుల వాంగ్మూలాలు తీసుకోవడంలో కఠినంగా వ్యవహరించవద్దని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించవద్దని హెచ్చరించింది. తప్పుడు విధానాలు అవలంబిస్తే చాలా సీరియస్‌గా పరిగణిస్తామని వెల్లడించింది. అంతే కాకుండా ‘సిట్‌’ తన అధికార పరిధిలోనే విచారణ చేయడంతో పాటు, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు మాత్రమే రిపోర్టు చేయాలని, సంతకాల సమయంలో స్టేట్‌మెంట్‌లో వేరే అంశాలున్నాయని, వారు నిరాకరిస్తే బలవంత పెట్టకూడదని స్పష్టం చేసింది. 
    అందుకే ఈ కేసులేవీ నిలబడేవి కావని, భవిష్యత్తులో అన్నీ నీరుగారి పోతాయని గట్టిగా విశ్వసిస్తున్నామని, అలాగే నిజానిజాలు బయటకొచ్చిన తర్వాత అసలు దోషులెవరు అనేది ప్రజలకు కూడా తెలుస్తుందని జల్లా సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Back to Top