తాడేపల్లి: తమ పార్టీ నాయకుడు వీరయ్యచౌదరి దారుణహత్యకు గురైతే దాన్నీ రాజకీయం చేయాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మొదలు, ఆ పార్టీ నేతలంతా పని చేశారని, ఆ హత్యను తమపై నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ ఆక్షేపించారు. చివరకు ఆ కుట్ర సాకారం కాకపోవడంతో, ఆ హత్య కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తూ, వీరయ్య చౌదరి కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తున్నారని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపూడి ప్రభాకర్రావు తెలిపారు. టీడీపీ కుట్రలు. కుతంత్రాలు: రాష్ట్రంలో ఏ మంచి జరిగిన తానే చేసినట్టు, ఏ చెడు జరిగినా దానికి వైయస్ జగనే కారణమని చెప్పడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడి హత్య జరిగితే, హడావిడిగా అక్కడకు వెళ్లిన చంద్రబాబు, వాస్తవాలు తెలుసుకోకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పాపాలే హత్యకు కారణమంటూ మా పార్టీపై నిందలేసి చేతులు దులిపేసుకున్నాడు. తీరా చూస్తే వీరయ్య చౌదరిని సొంత పార్టీ నాయకులే హత్య చేశారని తేల్చిన పోలీసులు, నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పుడు టీడీపీ మరో కుట్ర చేస్తోంది. చివరి క్షణం వరకు పార్టీ కోసం పని చేసిన వీరయ్య చౌదరి కుటుంబాన్ని మోసం చేయడానికి వ్యూహ రచన చేస్తోంది. ఆ దిశలోనే, ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న తమ పార్టీ నాయకులను నిర్దోషులుగా విడిచిపెట్టే కుట్ర చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని కార్యకర్తలు కూడా గుర్తించడం వల్లనే వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ను వారు అడ్డుకున్నారని జూపూడి ప్రభాకర్రావు తెలిపారు