తిరుపతి: వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై పార్టీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. కూటమి అరాచక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని, అక్రమ అరెస్టులు నుంచి నాయకులను కాపాడాలని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని అంబేద్కర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చెవిరెడ్డి స్వగృహం తుమ్మలగుంటకు వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి.. తామంతా వారి వెంటే ఉంటామని నియోజకవర్గపు కార్యకర్తలు భరోసా ఇచ్చారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభం అయ్యాయని కార్యకర్తలు హెచ్చరించారు. చెవిరెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ప్రజాగ్రహానికి ఆహుతి కాక తప్పదు: ఎంపీ గురుమూర్తి చెవిరెడ్డి అరెస్ట్పై వైయస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్ది అరెస్టు అక్రమం. కనీసం కేసుకు సంబందించిన ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అతి త్వరలో ప్రజాగ్రహానికి ఆహుతి కాక తప్పదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.