కర్నూలు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని కర్నూలు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకి అమరావతి, పోలవరం తప్ప ప్రజల గురించి ఆలోచించే టైమ్ లేదని మండిపడ్డారు. చంద్రబాబు లక్ష కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మిస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అమ్మ ఒడిగానీ, విద్యా దీవెన గానీ రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుతంలో చంద్రబాబు పబ్లిసిటీ అప్పులు తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని , వాటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వైయస్ జగన్ ను మళ్లీ సీఎం చేసుకుందామని ఎస్పీ మోహన్ రెడ్డి పిలువునిచ్చారు.