రాజమహేంద్రవరం : కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని, వైయస్ జగన్ కార్మిక పక్షపాతి అని వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. కార్మిక శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదన్నారు. రాజమహేంద్రవరంలో మేడే సందర్బంగా భరత్ రామ్ నేతృత్వంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు, సప్పా ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం సెంటర్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ.. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చెప్పినట్లు పార్టీ పేరులోనే శ్రామిక ఇమిడి ఉన్న పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రెండున్నరేళ్లు కరోనాతో పోయిందని, మిగిలిన రెండున్నరేళ్లు జగనన్న సహకారంతో చేయదగిన రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేసానని అన్నారు. అందులో భాగంగా ఒకప్పుడు వర్షం వస్తే వైద్యానికి కూడా వీలులేని పరిస్థితుల్లో లేని ఈ ఎస్ ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి వందకోట్లతో వందపడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని భరత్ అన్నారు. అయితే అక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకం వంటి విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఏదో విమర్శించడం కోసమో మరోదానికోసమో కుకుండా గత జగనన్న ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, జగనన్న సీఎం అవుతారని భరత్ ధీమా వ్యక్తంచేశారు. వైయస్ జగన్ హయాంలో కార్మిక ఉద్యమాలు లేవు: గౌతమ్ రెడ్డి పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా చూసిన వైయస్ జగన్ సీఎం అయ్యాక ఇచ్చిన హామీలు అమలు చేసారని, అందులో భాగంగా పారిశుధ్య కార్మికుల జీతాలు 9 వేల నుంచి 18 వేలకు, ఆతర్వాత 20వేలకు పెంచారని అన్నారు. అలాగే ఆటో కార్మికులకు, దర్జీలకు పదివేల రూపాయలు ఖాతాల్లో జమచేశారని, చేనేత కార్మికులకు 24వేల రూపాయలు ఖాతాల్లో వేశారని ఆయన అన్నారు. అందుకే వైయస్ జగన్ హయాంలో కార్మికుల ఉద్యమాలు లేవన్నారు. ఎన్నో హామీలతో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారని, యువజనులు ఉద్యమించారని, కార్మికులు ఉద్యమం చేస్తున్నారని, ఇక కర్శకులైతే సరేసరి అన్నట్లుగా ఉందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులను అక్కున చేర్చుకున్నదెవరో గ్రహించాలన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికుల హక్కులు సాధించబడ్డాయని, అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం శోచనీయమని గౌతమ్ రెడ్డి అన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజానీకం రోడ్లపైకి రాబోతోందని అయన అన్నారు. దీంతో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పదన్నారు. కులమత వర్గాలకు అతీతంగా భరత్ నాయకత్వంలో మే 20న నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని గౌతమ్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాబోయే రోజుల్లో ఈ రాజమండ్రిలో స్థిరమైన నాయకుడిగా భరత్ కి కార్మికలోకం యావత్తు అండగా నిలబడాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం జరిగిన భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, నగర వైయస్ఆర్సీపీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.