వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయన్నారు. నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకున్న అనంతరం 11 గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. ఉదయాన్ని వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయని, వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. 

అత్యంత సౌమ్యుడు వైయస్‌ వివేకానందరెడ్డి: ఎమ్మెల్యే రాచమల్లు

వైయస్‌ఆర్‌ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజల కోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వైయస్‌ వివేకానందరెడ్డి అని గుర్తు చేశారు. అత్యంత సౌమ్యుడు, జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని గ్రామాల నాయకులతో వైయస్‌ వివేకానందరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. గతంలో అన్న దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి తోడుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం కుమారుడికి తోడుగా ప్రయాణం చేస్తున్నారన్నారు. కొన్ని రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. కుమారుడు వైయస్‌ జగన్‌ మంచి స్థాయికి రాబోతున్నా తరుణంలో వైయస్‌ వివేకానందరెడ్డి హఠాత్తుగా మరణించడం తీవ్ర బాధను కలిస్తుందన్నారు. 

గొప్ప గుణమున్న వ్యక్తి: కాటసాని

శత్రువు కూడా సాయం చేసే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైయస్‌ వివేకానందరెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ నేత కాటసామి రామిరెడ్డి అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న వివేకానందరెడ్డి మరణం యావత్తు జిల్లా ప్రజలందరినీ కలచివేస్తుందన్నారు.  

Back to Top