తాడేపల్లి: ప్రత్యేక పాఠశాలను స్థాపించి దాడులు, అవమానాలను సైతం లెక్క చేయకుండా మహిళాభ్యుదయం కోసం పోరాడిన సావిత్రీబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని వైయస్ఆర్సీపీ నాయకులు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రీబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించిన అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రీ బాయి పూలే స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ గారు కూడా తన ఐదేళ్ల పాలనలో విద్యా, సంక్షేమ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఆడబిడ్డ పుట్టే క్షణం నుంచి ప్రతి దశలోనూ అండగా నిలబడి ప్రోత్సహించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ వింగ్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డితోపాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళా సాధికారత ధ్యేయంగా పోరాటం: మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలపై చిన్నతనం నుంచే పోరాటం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి సావిత్రీబాయి పూలే. వివాహం తర్వాత కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తూ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా వితంతు వివాహాలను జరిపిస్తూ మహిళాభివృద్ధికి నడుం బిగించారు. మహిళా సాధికారత కోసం ఆమె ఎన్నో ఉద్యమాలు చేశారు. మహిళలు చదువుకుంటే సమాజం పురోభివృద్ధి చెందుతుందని నమ్మి మహిళలు చదువుకోవాలని ప్రోత్సహించారు. మహిళా విద్య కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం సావిత్రీబాయి పూలే జన్మదినాన్ని రాష్ట్ర విద్యాదినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆమె ఆలోచనా విధానాలను గత వైయస్ జగన్ ప్రభుత్వం అనుసరించి మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. అవమానాలు, దాడులను లెక్క చేయలేదు: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆడబిడ్డల చదువులపై వివక్ష చూపే సమాజంపై పోరాడి మహిళల హక్కులను సాధించిన గొప్ప నాయకురాలు సావిత్రీబాయి పూలే. మహిళల కోసం దేశంలో మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఎన్నోదాడులు, అవమానాలకు వెరవకుండా మహిళలు చదువుకోవాలనే మొక్కవోని దీక్షతో ఆమె సాగించిన పోరాట ఫలితంగానే ఈరోజున మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్నారు. భర్తతో కలిసి వెనుబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం. సావిత్రీబాయి స్ఫూర్తితో వైయస్ఆర్సీపీప్రభుత్వ హయాంలో అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సావిత్రీబాయి పూలే స్ఫూర్తితో వైయస్ జగన్: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి చదువు ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పి మహిళల చదువులను ప్రోత్సహించిన ఘనత సావిత్రీబాయి పూలేకి దక్కుతుంది. ఆమె పోరాటాల నుంచి స్ఫూర్తి పొంది వైయస్ జగన్ పాలనలోనూ ఐదేళ్లపాటు మహిళలను అన్నిరంగాల్లో ప్రోత్సహించడం జరిగింది. రాజకీయ రంగంలోనూ పురుషులతోపాటు మహిళలకు కూడా వైయస్ జగన్ గారు సమాన అవకాశాలు కల్పించారు.