శింగరాయకొండ: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న కసాయి ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నాడని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగరాయకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 118 జీవోతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తున్నారని, పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రకు చంద్రబాబు తెరలేపాడని వివరించారు. వైయస్సార్సీపీ హయాంలో వంద శాతం ఫీజు చెల్లించి విద్యార్థులను చదువులకు ప్రోత్సహిస్తే, కూటమి పాలనలో రూ. 10,700 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు నిజం చేస్తున్నాడని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. వైయస్సార్సీపీ హయాంలో ఐదేళ్లూ వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించడం జరిగింది. కానీ కూటమి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఫీజు బకాయిలు రూ. 10,700 కోట్లకు చేరుకున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఫుల్ ఫీజు చెల్లించాలని అడిగిన కాలేజీలను, విద్యార్థులను కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది. కూటమి ప్రభుత్వం జీవో నంబర్ 118 తెచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పూర్తిగా మంగళం పాడే కుట్రలకు తెరలేపింది. ఎంతో మహోన్నత లక్ష్యంతో దివంగత వైయస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రైవేటుపరం చేసి పేదలకు చదువులను దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు విచ్చలవిడిగా ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతూ జల్సాలు చేయడం మానేస్తే విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం ఏమంత కష్టం కూడా కాదు. గత ప్రభుత్వ బకాయిలను మేము చెల్లించం అని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనం. జి అంటే గూగుల్ కాదు.. జి అంటే జిమ్మిక్కు లోకేష్ చెప్పినట్టు జి అంటే గూగుల్ కాదు.. కూటమి రెండేళ్ల పాలన చూసిన ప్రజలంతా జి అంటే జిమ్మిక్కులు అంటున్నారు. విద్యారంగం మీద లోకేష్కి ఏమాత్రం అవగాహన లేదు. తన శాఖ మీద ఆయనకు పట్టుకూడా లేదు. మాయమాటలు, జిమ్మిక్కులతో విద్యార్థులను వెన్నుపోటు పొడిచిన కసాయి ప్రభుత్వం ఇది. వారి ఆటలు ఇంకా ఎంతోకాలం సాగవు. చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ప్రభుత్వం పట్టించుకోకుంటే వైయస్సార్సీపీ తరఫున ప్రభుత్వంపై ఉద్యమిస్తాం.