మైనార్టీల సంక్షేమంపై దగ్గుపాటి గాలి మాటలు

అనంత‌పురం మేయర్ మహమ్మద్ వసీం ఫైర్‌

అనంతపురం: మైనార్టీల సంక్షేమంపై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు గాలి మాటలే తప్ప ఆచరణలో ఆయన చేసింది ఏమీలేదని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మైనార్టీలకు ఏమీ చేయలేదని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమన్నారు. అసత్య ప్రచారాలు చేయడం దగ్గుపాటి ప్రసాద్‌కు అలవాటైందని విమర్శించారు.

దివంగత ముఖ్యమంత్రి  వైయ‌స్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే ముస్లిం యువత విద్య, వైద్య రంగాల్లో ముందుకు వచ్చారని వసీం తెలిపారు. అలాగే వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపును కల్పించారని పేర్కొన్నారు.

వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఇమామ్‌లకు రూ.10 వేల గౌరవ వేతనం, మౌజమ్‌లకు రూ.5 వేల గౌరవ వేతనం, హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సహాయం, హజ్ ఆస్తుల పరిరక్షణ వంటి చర్యలు చేపట్టిందన్నారు. అదేవిధంగా సుమారు రూ.23 వేల కోట్లతో సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. పేద ముస్లిం యువతుల వివాహాలకు రూ.లక్ష ‘షాదీ తోఫా’ అందజేసినట్లు గుర్తుచేశారు.

ముస్లింలపై ప్రేమ ఉందని ఎమ్మెల్యే చెప్పడం కేవలం మాటలకే పరిమితమని, వాస్తవానికి ముస్లింలను రాజకీయంగా దెబ్బతీయడం, వారిపై దాడులు జరగడం వంటి ఘటనలు జరుగుతున్నాయని వసీం ఆరోపించారు. ముస్లిం స్మశానవాటిక కాంపౌండ్ వాల్‌కు నిధులు తానే తెచ్చానని ఎమ్మెల్యే చెప్పడం అసత్యమని, నగర పాలకవర్గం కృషితోనే ఆ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

నగరంలోని 120 మసీదుల మరమ్మతుల విషయంలో కూడా ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టినట్లు చూపించగలరా అని ప్రశ్నించారు. మేయర్‌గా తనకు అవకాశం ఇచ్చింది వైయ‌స్ జగన్ అని, ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అనంతపురంలో ముస్లిం మైనార్టీలు అంతా టీడీపీ వైపే ఉన్నారని ఎమ్మెల్యే చెప్పడం వాస్తవం కాదని, ముందుగా తనతో ఉన్న మైనార్టీల సంఖ్యను గమనించాలని సూచించారు. అనంత వెంకటరామిరెడ్డి మసీదులకు చేసిన సేవలను మైనార్టీలు బాగా గుర్తుంచుకున్నారని, ప్రజలు ఎవరు ఏమి చేశారో అన్నీ గమనిస్తున్నారని మేయర్ వసీం పేర్కొన్నారు.  సమావేశంలో కార్పొరేటర్లు  సైఫుల్లా బేగ్, ఇషాక్ , మైనార్టీ నాయకులు ముక్తియార్, బాబాస‌లాం తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top