తిరుపతి: భక్తులు శ్రీవారికి నిలువ దోపిడీ ఇచ్చుకుంటుంటే ఇంకోపక్క పరకామణిలో దేవుడి సొమ్ము ఆయనకే దక్కకుండా కొంతమంది దొంగలు కాజేస్తున్నారని, ఈ వరుస చోరీలు చూస్తుంటే దీని వెనుక పెద్దల హస్తం ఉండే ఉంటుందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య వంటి వారు ఆరు నెలల్లోనే 24 సార్లు చోరీకి పాల్పడ్డాడంటే మామూలు విషయం కాదని, చోరీ తరువాత కూడా ఆయన నుంచి ఆస్తులు ఎందుకు రాయించుకోలేదని ప్రశ్నించారు. మూడేళ్ల కిందట రవికుమార్ చోరీ చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టిన అధికారులు ఏడాది కిందట చోరీ చేసిన పెంచలయ్య వీడియో ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా చెన్నై పరకామణిలో పనిచేసే కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ విదేశీ కరెన్సీ తక్కువగా చూపించి రూ. 87 లక్షలు అవకతవకలకు పాల్పడినా ఉద్యోగంలో కొనసాగడం టీటీడీ వైఫల్యమేని స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ హయాంలో పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ నుంచి రూ. వంద కోట్ల విలువై ఆస్తులు రాయించుకున్నామని అయినా దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్న చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక పరకామణిలో జరుగుతున్న చోరీలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పరకామణిలో జరిగే అవకతవకలపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా అని భూమన ప్రశ్నించారు. చోరీలకు పాల్పడుతున్ననిందితుల వెనుక ఉన్న పెద్ద తిమింగళాలను బయటకు తీస్తామని, త్వరలోనే వీటిపై ఫిర్యాదు చేస్తామని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... నేరం చేసి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు తిరుమల పరకామణిలో చోరీ జరిగినట్టు పత్రికల్లో పెద్ద ఎత్తున కథనం వచ్చింది. దీంతోపాటు చెన్నై శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న పరకామణిలోనూ విదేశీ నోట్లను విలువను తక్కువగా చూపించి రిజిస్టర్ లో నమోదు చేసి ఎస్. కృష్ణకుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ అవకతవకలకు పాల్పడినట్టు నా వద్ద ఆధారాలున్నాయి. అయినా ఆ ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో ఆయన సుప్రీంకోర్టు నుంచి అరెస్టు కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. 6.10.2024న ఈ సంఘటన జరిగితే 14.03.2025న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 950 విదేశీ కరెన్సీ నోట్లను తక్కువ డినామినేషన్గా చూపించి టీటీడీ రిజిస్టర్లో నమోదు చేశాడని విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్టు సారాంశం. కానీ ఎఫ్ఐఆర్లో ఎక్కడా ఆ 950 నోట్ల డినామినేషన్ని ఏమిటనేది మెన్షన్ చేయలేదు. కేవలం రూ.6,74,047 మేర నష్టం చేసినట్టు మాత్రమే పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందని దీనిపై వాకబు చేస్తే అవన్నీ 950 వంద డాలర్ల నోట్లని, వాటి మొత్తం విలువ దాదాపు రూ. 87,21,000 ఉంటుందని తెలిసింది. 6.10.2024న ఈ సంఘటన జరిగితే దాదాపు నెలన్నర తర్వాత 17.11.2024న సెక్యూరిటీ గార్డులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 19.02.2025న ఈవోకి విజిలెన్స్ రిపోర్టు అందజేశారు. ఇంత కాలయాపన జరగడం మూలంగా రూ. 87.21 లక్షల దొంగతనం చేసిన నిందితుడు కృష్ణకుమార్ అరెస్ట్ కాకుండా ఉండటమే కాకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. పైపెచ్చు సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం చూస్తుంటే ఏదో పెద్ద మతలబు ఉండే ఉంటుందనిపిస్తుంది. 6 నెలల్లో 24 సార్లు దొంగతనం చేశాడంటే.. తిరుమల పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారంపై సాక్షిలో కథనం రావడంతో టీటీడీ అధికారులు స్పందించారు. చోరీ నిజమంటూనే కోట్లాది రూపాయల కుంభకోణం కాదని సమర్థించుకోవడం సిగ్గుచేటు. పరకామణిలో చోరీకి పాల్పడిన పెంచలయ్య కేవలం ఒక్కసారి కాదు.. మొత్తం 24 సార్లు బంగారు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒక్కసారి బంగారు బిస్కెట్ దొంగతనం చేసినప్పుడు పట్టుకుని విచారణ చేయగా పలుసార్లు దొంగతనం జరిగినట్టు తెలిసి సొత్తును రికవరీ చేసినట్టు టీటీడీనే చెబుతోంది. ఒక్కసారే దొంగతనం చేస్తే 550 గ్రాముల బంగారు, 117 గ్రామలు వెండి దొరకడం సాధ్యమయ్యే పనేనా? కానీ టీటీడీ అధికారులు కేవలం ఒక్క బంగారు బిస్కెట్ మాత్రమే చోరీకి గురైందని ఎలా ప్రకటన ఇస్తారు? వైయస్ఆర్సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తి ఎనిమిది 100 డాలర్ల చోరీకి పాల్పడితే దానిపై విచారణ జరపడమే కాకుండా టీటీడీకి రూ. 14 కోట్ల రవికుమార్ ఆస్తులు రాయించాం. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకుపైనే ఉంది. అయినా మాపై ఎన్నో కేసులు పెట్టి అరెస్టు చేయాలన్న పథకం రచించింది ఈ కూటమి ప్రభుత్వం. 24 సార్లు దొంగతనాలు చేసిన పెంచలయ్య మీద ఒకటే కేసు ఎందుకు పెట్టారో టీటీడీ, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రవి కుమార్ చేసిన దొంగతనంపై ఏడాదిన్నరగా సీఐడీ, ఏసీబీ విచారణ పేరుతో లోతుగా విచారణ చేస్తున్నారు. కానీ పెంచలయ్య అనే చిన్న చేప వెనుక పెద్ద తిమింగలాలను పట్టుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడి ఆస్తులను టీటీడీకి రాయించి ఇవ్వాలి. పెంచలయ్య వెనుక ఎవరున్నారో తేలాలి భక్తులు శ్రీవారికి నిలువ దోపిడీ ఇచ్చుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీవారినే నిలువునా దోచుకుంటున్నారు. దేవుడి సొమ్మును దేవుడే తీసుకోకుండా కాపాలా కాస్తున్నారేమో అనిపిస్తుంది. టీటీడీలో జరిగే సంఘటనలన్నీ చంద్రబాబుకి ముందు నెయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారాయి. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందని చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం చుట్టూ ముసురుకుంటున్న అవినీతి చీకట్లే సాక్ష్యాలు. కానుకలను చోరీ చేయడం ఎంత పాపమో, ఆ చోరీని చోద్యం చూస్తున్న పాలకమండలిది కూడా అంతేపాపం. ఆరు నెలల్లోనే 24 సార్లు బరితెంగించి దొంగతనాలకు పాల్పడేంత బరితెగింపు పెంచలయ్యకి ఎక్కడిది? కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు ప్రచారం చేసి ఎలాగైతే రేట్లు పెంచి ఇందాపూర్ ముసుగులో హెరిటేజ్కి టీటీడీ నిధులు దోచి పెట్టారో, అదే విధంగా పరకామణి చోరీ కేసులో రవికుమార్ విచారణ ముసుగులో పెంచలయ్య వంటి వారిని మోహరించి పరకామణి సొమ్ము కాజేసే కుట్రలు చేస్తున్నారేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. రవి కుమార్ చేసిన పరకామణి చోరీ వ్యవహారంలో అడ్మినిస్ట్రేషన్ తప్పిదాలు కాకుండా నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. మూడేళ్ల కిందటి రవికుమార్ చోరీ వ్యవహారం బయటకు తీసిన అధికారులు, ఏడాది కిందట చోరీ చేసిన పెంచలయ్య వీడియోలు ఎందుకు బయటపెట్టడం లేదు? ఎందుకంటే, ఈ వీడియోలు బయటకొస్తే దాని వెనుక ఎవరెవరు ఉన్నారో తెలిసిపోతుంది కాబట్టే వీడియోలు రాకుండా నొక్కి పెడుతున్నారు. పరకామణిలో ఇలా చోరీలు జరుగుతున్నాయని తెలిస్తే కానుకలు సమర్పించడానికి ఇకపై భక్తులు ముందుకొస్తారా? దర్శనాల పేరుతో కొండపై దళారుల దోపిడీ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయ్యాక తిరుమలలో జరిగిన ఘోరాలు, అపచారాలకు లెక్కేలేదు. కొండపై రోజూ 4 వేల రూ.300 ల టికెట్ను రూ. 3వేలకు దళారులు విక్రయిస్తున్నారు. ఎన్ని నేరాలు జరుగుతున్నా ఈ రెండేళ్లలో ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేసిన పాపానపోలేదు. ఇప్పటికైనా మఠాధిపతులు, పండితులు బీఆర్ నాయుడి అకృత్యాలపై ప్రశ్నించాలి. కృష్ణకుమార్, పెంచలయ్య చేసిన నేరాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము చంద్రబాబుకి ఉందా? పరకామణిని ఆధునీకరించామని చెప్పుకునే చంద్రబాబు... ఈ సీసీ టీవీ ఫుటేజ్ని ఎందుకు బయటపెట్టడం లేదు? పరకామణి చోరీలపై త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తాం.